ఈటీవీ ''జబర్దస్త్''కు ఏమైంది?
ఎనిమిది సంవత్సరాలుగా తెలుగు భాషలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న కార్యక్రమం ఏదైనా ఉందా? అంటే కళ్లు మూసుకొని చెప్పవచ్చు.. ''జబర్దస్త్'' అని. అలాగే ''ఎక్స్ట్రా జబర్దస్త్'' కూడా . ఈ రెండు కార్యక్రమాలు ఉన్నాయంటే టీవీముందు సిద్ధంగా కూర్చునే తెలుగు ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే వాటికి దూరం జరుగుతున్నారు. కామెడీ తగ్గుతోందా? ఆదరణ తగ్గుతోందా? ఆకర్షణ తగ్గుతోందా? అంటే మూడూ అని సమాధానం చెప్పవచ్చు.

తప్పుకున్న హైపర్ ఆది, సుడిగాలి సుధీర్
''జబర్దస్త్''లో టీమ్ లీడర్లుగా ఉన్నవారంతా ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. పంచ్ డైలాగులతో అతి తక్కువ సమయంలో స్టార్ కమెడియన్గా మారిన హైపర్ ఆది, బుల్లితెర ప్రేక్షకుల్లో సూపర్స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్ ఇద్దరూ జబర్దస్త్ నుంచి, ఎక్స్ ట్రా జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు. దీంతో ఒక్కసారిగా రెండు షోలు కళ తప్పాయి. సుడిగాలి సుధీర్ టీమ్కు గుండె లాంటి గెటప్ శ్రీను కూడా సుధీర్ కంటే ముందుగానే షో నుంచి తప్పుకున్నారు. ఇతరత్రా ఆఫర్లు వస్తుండటం, సినిమాల్లో అవకాశాలు వస్తుండటంతో వీరిద్దరూ తప్పుకున్నారు. ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయిన రామ్ప్రసాద్తో 'ఆటో రామ్ప్రసాద్' అంటూ ఒక టీమ్ తయారుచేశారు నిర్వాహకులు. ఈ రెండు టీమ్ల కంటే ముందుగా చమ్మక్చంద్ర వెళ్లిపోయారు. పక్క పక్క కుటుంబాలను నేపథ్యంగా ఎంచుకొని అతను చేసే స్కిట్స్ ఈ రెండు టీమ్ల స్కిట్స్తో సమాంతరంగా ఆదరణ పొందేవి. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ ఉండటంతో చమ్మక్ చంద్ర వెళ్లిపోయినప్పటికీ ఆ ప్రభావం జబర్దస్త్ పై పడలేదు. కానీ ఇప్పుడు అంతా లోటుగానే ఉంటోంది.

కొత్త కొత్త టీమ్లు దర్శనమిస్తున్నాయి!! కామెడీ పేలడంలేదు!!
హైపర్ ఆది, రైజింగ్ రాజు టీమ్ కూడా లేదు. కొత్త కొత్త టీమ్లు దర్శనమిస్తున్నాయి. ఆది స్థాయిలో పంచ్లు వేసేవాళ్లు లేరు. అలాగే రామ్ప్రసాద్ ఆటో పంచ్లు వేసినా అవి సుధీర్, గెటప్ శ్రీను చేసినప్పుడే వాటికి అలంకారంగా ఉండేది. ఇప్పుడు వారిద్దరూ లేరు. దీనికితోడు జడ్జిగా నాగబాబు ముందే తప్పుకున్నారు. జబర్దస్త్ నిర్వాహకులైన మల్లెమాల ఎంటర్టైన్మెంట్తో విభేదాలు రావడంతో ఆయన ప్రస్తుతం స్టార్ మాలో కామెడీ స్టార్స్ కార్యక్రమానికి జడ్జిగా ఉంటున్నారు. మాటీవీకి ముందు జీ తెలుగులో రూపొందించిన కామెడీ ప్రోగ్రామ్కు కూడా ఆయనే జడ్జిగా వ్యవహరించారు. నాగబాబు స్థానంలో మనోను భర్తీ చేశారు. ఆయన విజయవంతమయ్యారు. అలాగే రోజా మంత్రిగా ఎంపికవడంతో జబర్దస్త్ను వీడలేక వీడలేక విడిచి వెళ్లారు. ప్రస్తుతం ఇంద్రజ ఉన్నారు. ఆమె కూడా విజయవంతమయ్యారు. అయితే శుక్రవారం ఎక్స్ ట్రా జబర్దస్త్ ను ఇద్దరు లేడీ జడ్జెస్ తో నడపాలని చూస్తున్న నిర్వాహకులు ఇంద్రజతోపాటు మీనా, శ్రద్ధాదాస్, లైలా, ఆమని తదితరులతో ట్రయల్ చూస్తున్నారు.

సమస్యకు మూలం తెలుసుకొని పరిష్కరిస్తేనే..
టీఆర్పీ రేటింగ్స్ తోపాటు మంచి ఆదాయాన్ని కూడా ఆర్జించిపెట్టే జబర్దస్త్ మెల్లమెల్లగా ప్రేక్షకుల ఆదరణ కోల్పోతుండటం నిర్వాహకులను ఆందోళన పరిచేదే. పారితోషికం విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయని బయటకు వార్తలు వస్తుంటాయి. వాటిల్లో వాస్తవమెంతో నిర్వాహకులకు, నటించేవారికే తెలియాలి. సమస్యకు మూలం ఎక్కడుందో తెలుసుకొని దాన్ని పరిష్కరించడంతోపాటు సమర్థవంతమైన టీమ్ లతో జబర్దస్త్ ను నడిపితే లోటు లేకుండా చూస్తారని, కానీ వారికి కావల్సిన కామెడీని అందించడంలో విఫలమైతే కష్టమేననే వ్యాఖ్యలు వస్తున్నాయి. మరి మల్లెమాట టీమ్ ఏం చేస్తుందో చూడాలి.!!












Click it and Unblock the Notifications