చంద్రబాబు-పవన్ కు జగన్ మార్క్ దెబ్బ : సైలెంట్ ఆపరేషన్ : అక్కడ నొక్కితే - ఇక్కడ రీసౌండ్..!!
ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత హంగామా లేదు. తాను చేయదలచుకున్న పని చేసుకుపోతున్నారు. ప్రచార ఆర్భాటాలు లేవు. కానీ, రాజకీయంగా మాత్రం తన లక్ష్యం ఏంటో స్పష్టంగా నిర్దేశించికున్న సీఎం జగన్ ఆ దిశగా అడుగులు మాత్రం జాగ్రత్తగా వేస్తున్నారు. తనను ఎవరైతే లెక్క చేయటం లేదో..ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వారికి తన మార్క్ దెబ్బ మాత్రం రుచి చూపిస్తున్నారు. ఇదే విషయం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ తో పాటుగా సినీ ఇండస్ట్రీల్లోనూ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి అయిన తరువాత క్రమేణా రాష్ట్రం పైన చంద్రబాబు ముద్ర తొలిగించే ప్రయత్నం చేసారు.
రాజకీయంగా ఇరకున పెడుతూ
రాజకీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా సరే...తన లక్ష్యం కోసం తాను ఎంచుకున్న మార్గంలోనే ముందుకు నడుస్తున్నారు. అమరాతిలో చంద్రబాబు పార్టీ నేతలు..బినామీలు కోట్లాది రూపాయాల విలువ చేసే భూములను సొంతం చేసుకున్నారనేది తొలి నుంచి వైసీపీ ఆరోపణ. దీంతో..మూడు రాజధానుల అంశం తెర మీదకు తీసుకొచ్చారు. మూడు ప్రాంతాల్లో జగన్ అంచనా వేసినట్లుగా చంద్రబాబు అమరావతికి మద్దతుగానే నిలిచారు. దీంతో..అటు ఉత్తరాంధ్ర..ఇటు రాయలసీమ ప్రాంతాల్లో చంద్రబాబును వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం దక్కింది.
ఒక్కో అంశంలె పై చేయి సాధిస్తూ
అదే సమయంలో 2019 ఎన్నికల్లో పార్టీ సీట్ల కేటాయింపులో.. అధికారంలోకి వచ్చిన తరువాత కేబినెట్ విస్తరణ-పదవుల కేటాయింపులో ఊహించని విధంగా సామాజిక సమీకరణాలు అమలు చేసారు. అప్పటి వరకు బీసీలంతా టీడీపీతోనే అనే నమ్మకాన్ని టీడీపీ నేతల్లోనే పోగొట్టేలా నిర్ణయాలు తీసుకున్నారు. చంద్రబాబు తో సఖ్యతగా ఉంటారనే పేరున్న జాతీయ స్థాయి పారిశ్రామిక దిగ్గజాలు ఇద్దరినీ తన వైపు తిప్పుకోగలిగారు. అటు కేంద్రంతో సంబంధాల పేరుతో బీజేపీ నేతలతోనూ సన్నిహితంగా మెలుగుతున్నారు. ఫలితంగా చంద్రబాబు కేంద్రానికి దగ్గర అయ్యే అవకాశం లేకుండా జగ్రత్త పడుతున్నారు.
టీడీపీని రాజకీయంగా దెబ్బ తీయటమే లక్ష్యంగా
ఈ వరుస నిర్ణయాలతో ఇటు టీడీపీ ఆర్దిక మూలాలు..రాజకీయ బలాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ఇక, రాజకీయంగా మరో ప్రత్యర్ధి పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్ సినిమా సమయంలో టిక్కెట్ల ధరల పెంపు అంశం సడన్ గా వివాదాస్పదమైంది. సాధారణంగా ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు తీసుకున్నా...సినీ ప్రముఖులు వచ్చి మర్యాద పూర్వకంగా కలవటం ఆనవాయితీగా వస్తోంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు కలిసేవారు.
పవన్ కు మద్దతు లేకుండా చేయటంతో
అయితే, జగన్ సీఎం అయిన తరువాత చిరంజీవి రెండు సార్లు, సినీ అంశాల పైన ఇండస్ట్రీ పెద్దలు ఒక సారి కలిసారు. సినీ పరిశ్రమలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఆన్ లైన్ టిక్కెట్ విధానం అంశాన్ని ప్రభుత్వం బయటకు తీసింది. పరిశ్రమ నుంచే ఆ ప్రతిపాదన వచ్చిందనే విషయం బయటకు చెప్పలేదు. ప్రతిపక్షాలు ప్రభుత్వ నిర్ణయం పైన రాజకీయంగా రాద్దాంతం చేసిన తరువాత అసలు విషయం బయట పెట్టింది. సినీ ఇండస్ట్రీ నుంచే ఈ ప్రతిపాదన వచ్చిందని చెప్పింది. ఆ తరువాత సినీ పెద్దలతోనూ భేటీ అయింది. వారంతా ఆన్ లైన్ టిక్కెట్ విధానానికి ఓకే చెప్పారు.
చిరంజీవి సైతం ప్రభుత్వం వైపే
ఇదే సమయంలో పవన్ కళ్యాన్ తనను టార్గెట్ చేయటం కోసం సినీ పరిశ్రమను ఇబ్బంది పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. కానీ, ప్రభుత్వం మూడ్ ఏంటో తెలుసుకున్న తెలుగు ఫిలిం ఛాంబర్ వెంటనే రంగంలోకి దిగింది. పవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని చెప్పింది. అదే సమయంలో చిరంజీవి నేరుగా పేర్ని నానికి ఫోన్ చేసారు. పరోక్షంగా ఆ స్పీచ్ పైన విచారం వ్యక్తం చేసారు. చిరంజీవి క్లోజ్ ఫ్రెండ్ నాగార్జున..బావ అల్లు అరవింద్ సైతం ఏపీ ముఖ్యమంత్రి పరిశ్రమను ఆదుకోవాలంటూ ఓపెన్ గా అప్పీల్ చేసారు.
సినీ పెద్దలు సీఎం జగన్ పైనే భారం వేస్తూ
ఒక రకంగా సినిమా ఇండస్ట్రీ నుంచి పవన్ ఏపీ ప్రభుత్వం పైన చేసిన విమర్శలకు మద్దతు లేకుండా ఒంటరి చేయటంతో ప్రభుత్వ వ్యూహం సక్సెస్ అయింది. కరోనా దెబ్బతో ప్రభుత్వ మద్దతు కావాల్సిందేనని ఇండస్ట్రీ పెద్దలు ఓపెన్ గానే చెబుతున్నారు. ఎప్పుడూ స్పందించని అల్లు అరవింద్ లాంటి వారు సైతం ముందుకొచ్చారు. అయినా.. ఇప్పటికే జగన్ ప్రభుత్వం నుంచి పరిష్కార దిశగా హామీ రాలేదు. పేర్ని నాని వరుస సమావేశాల వివరాలను సీఎంకు నివేదించినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి..అల్లు అరవింద్ ఇద్దరూ పవన్ కుటుంబ సభ్యులే . వారిద్దరూ పవన్ వ్యాఖ్యల తరువాత ప్రభుత్వ సహాయం కోరటం ద్వారా పవన్ వ్యాఖ్యలకు మద్దతివ్వటం లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది.
అయినా బయటకు కనిపించని సీఎం జగన్
ఇక, ఆర్దికంగా సినీ ఇండస్ట్రీలో కష్ట నష్టాలు ఎదుర్కొనే నిర్మాతలే ఇప్పుడు ఈ గ్యాప్ కు భర్తీ చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో పవన్ ను ఒంటిరి చేయటం..అదే విధంగా సినీ ఇండస్ట్రీ ప్రముఖులు సైతం తమను గుర్తించేలా చేయటంతో సీఎం జగన్ స్ట్రాటజీ వర్కవుట్ అయిందని విశ్లేషకుల అభిప్రాయం. అయితే, పవన్ కళ్యాణ్ వర్సస్ ఏపీ ప్రభుత్వం వ్యవహారంతో పొలిటికల్ - సినిమా సర్కిల్స్ ఉత్కంఠగా చూస్తున్నా... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి కర చర్చగా మారినా..ఇప్పటి వరకు సీఎం జగన్ మాత్రం ఎక్కడా స్పందించ లేదు. తన పని తాను చేసుకుపోతున్నారు.