చంద్రబాబుపై బీజేపీ దారిలో: పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక మౌనం
హైదరాబాద్: ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాలలో రాజకీయ వేడిని రాజేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాజ్యాంగ సంక్షోభం తప్పదనే ఘాటైన హెచ్చరికలు ఇరు రాష్ట్రాలు లేదా పార్టీల నేతలు హెచ్చరికలు జారీ చేసుకున్నారు.
చంద్రబాబు అరెస్టవుతారని, బాలకృష్ణ లేదా మరొకరు ముఖ్యమంత్రి అవుతారని ఒకరు అంటే, తమ వద్ద ఉన్న ఆధారాలతో కేసీఆర్ ప్రభుత్వం కూలడం ఖాయమని మరొకరు ధీటుగా స్పందించారు.
దాదాపు ఇరవై రోజుల పాటు తెలుగు రాష్ట్రాలు రాజకీయ వేడి కనిపించింది. ఇప్పుడిప్పుడే కొంత చల్లబడుతున్నట్లు కనిపిస్తున్నా, ఏప్పుడేం జరుగుతుందో చెప్పలేం.
అయితే, గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ - టీడీపీ కూటమికి మద్దతు పలికిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దీనిపై ఇప్పటి వరకు పెదవి విప్పక పోవడం చర్చనీయాంశం అవడమే కాకుండా.. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాలు నిలదీస్తున్నాయి.
అయితే, పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మౌనంగా ఉండటమే మేలని అడ్వైజర్లు సూచించిన కారణంగానే ఆయన మౌనంగా ఉండవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారం పైన బీజేపీ ఇప్పటి వరకు మౌనం పాటిస్తోంది. కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున తాము నిజానిజాలు వెల్లడయ్యాక స్పందిస్తామని చెబుతోంది. తన అడ్వైజర్లతో పాటు బీజేపీ సీనియర్లు కూడా పవన్ కళ్యాణ్కు అదే సూచన చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ ఇంకా మౌనంగా ఉండటంపై విపక్షాలు తీవ్రంగా ప్రశ్నిస్తున్నాయి. అయితే, కోర్టు పరిధిలో ఉన్నందున, న్యాయస్థానం తేల్చే వరకు మౌనంగా ఉండటమే మంచిదని సూచించడంతోనే పవర్ స్టార్ మౌనముద్రలో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా, ఇది కేవలం రెండు పార్టీలకు చెందిన అంశమని, పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన అవసరం అప్పుడే లేదనే వారు కూడా ఉన్నారు. కాగా, గబ్బర్ సింగ్ 2 షూటింగ్ పూర్తయిన అనంతరం పవన్ కళ్యాణ్ పొలిటికల్గా యాక్టివ్ అవుతారని అంటున్నారు.