బాబుకు 'దాసరి'తో జగన్ దెబ్బకుదెబ్బ!: మైసూరా అలక అందుకేనా?
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును దెబ్బకు దెబ్బ తీస్తారా? రాజ్యసభ సభకు పంపించే వారి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి టిడిపికి షాకివ్వనున్నారా అనే చర్చ సాగుతోంది.
మరో నాలుగైదు నెలల్లో రాజ్యసభకు ఎన్నికలు జరిగే అవకాశముంది. ఏపీలో నాలుగు సీట్లు ఖాళీ కానున్నాయి. వీరి స్థానంలో మూడు టిడిపి - బిజెపి కూటమికి, ఒకటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కనున్నాయి. టిడిపి - బిజెపి కూటమిలోని మూడింట ఒకటి బిజెపికి, రెండు టిడిపికి వెళ్లనున్నాయి.
ఈ నేపథ్యంలో చంద్రబాబు తమకు వచ్చిన రెండింటిలో ఒకటి కాపులకు, మరొకటి బిసి లేదా ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన పక్షంలో.. ఈసారి రాజ్యసభ టర్మ్ ముగియనున్న సుజనా చౌదరికి చెక్ చెప్పవలసి వస్తుంది. సుజనకు రెండో టర్మ్ అవకాశమిస్తే.. పైనున్న ఓ వర్గాన్ని పక్కన పెట్టవలసి వస్తుంది.
తులసి ; ఈ రోజు కార్టూన్

ఇటీవలి వరకు కాపు ఉద్యమం చంద్రబాబుకు చుక్కలు చూపించింది. ఈ నేపథ్యంలో కాపు వైపు చంద్రబాబు మొగ్గు చూపుతారా? లేక మరెవరికైనా అవకాశమిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. టిడిపిలో రాజ్యసభ రేసులో నారా లోకేష్ పేరు కూడా వినిపించడం గమనార్హం.
కాపు విషయంలో చంద్రబాబు ఓ వైపు డైలమాలో ఉంటే... జగన్ దీనిని క్యాష్ చేసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తనకు మద్దతు పలికిన కాపులకు.. రుణమేళా, కాపులను బీసీల్లో చేర్చేందుకు కమిషన్.. ఇలా పలు తాయిలాలు చంద్రబాబు ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలో వారిని తన వైపుకు తిప్పుకునేందుకు జగన్ కూడా తన వంతు ప్రయత్నాలు చేయవచ్చునని అంటున్నారు. ఈ సందర్భంగా ఇప్పుడు తన చేతిలో ఉన్న ఆయుధం కేవలం రాజ్యసభనేనని, దానిని చంద్రబాబుపై జగన్ ప్రయోగించే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
గతంలోనే కాపు సామాజిక వర్గానికి దాసరి నారాయణ రావును జగన్ కలిశారు. పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో దాసరిని జగన్ ఒప్పించి రాజ్యసభకు పంపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, వైసిపి ఒకే రాజ్యసభ సీటును గెలుచుకుంటుంది.
ఇప్పటికే విజయ సాయి రెడ్డికి మాట ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విజయ సాయి రెడ్డిని ఒప్పించి జగన్.. దాసరిని తెరపైకి తీసుకు వచ్చినా రావొచ్చని అంటున్నారు. తద్వారా తిరిగి జగన్ తెలుగుదేశం పార్టీ పైన వ్యూహాత్మక దెబ్బ తీసే అవకాశాలున్నాయని అంటున్నారు.
మరోవైపు, వైసిపి అధినేత జగన్ కడప పర్యటనలో గురువారం నాడు మైసూరా రెడ్డి గైర్హాజరయ్యారు. ఆయన గైర్హాజరీకి రాజ్యసభ అంశం కూడా ఓ కారణం కావొచ్చునని అంటున్నారు. మైసూరా టిడిపిలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మైసూరా రెడ్డి గతంలో టిడిపిలో తన రాజ్యసభ టర్మ్ పూర్తికాగానే వైసిపిలో చేరారు. వైసిపిలో తనకు రాజ్యసభ అవకాశం వస్తుందని ఆయన భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ సాయి రెడ్డి ఓవైపు, దాసరి నారాయణ రావు మరోవైపు ఉన్నందున ఆయన జగన్కు దూరం పాటిస్తుండవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications