(ఫోటోలు): జగన్కు భార్య పరామర్శ, సింగపూర్ ఈశ్వరన్ భాగస్వామి: బొత్స బాంబు
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ దీక్షా ప్రాంగణానికి ఆయన సతీమణి వైయస్ భారతి ఆదివారం నాడు వచ్చారు. ప్రత్యేక హోదా కోసం జగన్ గుంటూరు జిల్లా నల్లపాడులో నిరవధిక దీక్ష చేస్తున్న విషయం తెలిసింది.
ఈ సందర్భంగా దీక్షా ప్రాంగణానికి భారతి వచ్చారు. వైయస్ భారతి వేదిక పైన జగన్ పక్కన కూర్చొని... ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఉదయం గుంటూరు జీజీహెచ్ వైద్యులు జగన్కు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం క్షీణిస్తోందని చెప్పారు. జగన్ రెండు కిలోల మేర తగ్గారు.
జగన్ ప్రాణాలు లెక్క చేయడం లేదు: బొత్స
గుంటూరులోని నల్లపాడులో జరుగుతున్న దీక్షా స్థలిలోనే ఆదివారం పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, విజయ సాయిరెడ్డి, అంబటి రాంబాబు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.
జగన్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు రోజులుగా జగన్ దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జగన్ ప్రాణాలు లెక్క చేయడం లేదన్నారు. జగన్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందన్నారు.
ప్రత్యేక హోదా విషయంలో జగన్ పట్టుదలతో ఉన్నారన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జగన్ దీక్ష చేస్తున్నారన్నారు. దీక్షకు భారీ మద్దతు లభిస్తోందన్నారు. ప్రత్యేక హోదా ఏపీకి సంజీవిని అన్నారు. 22న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోడీ ప్రత్యేక హోదాపై స్పందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
జగన్ దీక్ష పైన చంద్రబాబు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే జాలి వేస్తోందన్నారు. చంద్రబాబులా మోసం చేసే మాటలు జగన్కు తెలియవన్నారు. అలీబాబా నలబై దొంగల్లా పంచభూతాలను టిడిపి దోచుకుంటోందన్నారు.
టిడిపి నేతల తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్, చంద్రబాబు భాగస్వామా కాదా అని సంచలన వ్యాఖ్య చేశారు. వ్యాపార భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు రాజధాని భూములు తాకట్టు పెట్టారని ఆరోపించారు.