27కు చేరుకున్న జగన్ దీక్షలు: ప్రత్యేకతలివే, అదృష్టమన్న వైసీపీ
కర్నూలు: కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ చేపట్టిన మూడు రోజుల జలదీక్ష సోమవారం ప్రారంభమైంది. రాష్ట్రం విభజన జరిగిన తర్వాత వైసీపీ అధినేత వైయస్ జగన్ చేపట్టిన 27వ దీక్ష ఇదని, 2, 7 కలిపితే 9 రావడం పార్టీకి అదృష్టమని వైపీసీ అంటోంది.
కర్నూలులో నంద్యాల రోడ్డులోని కేంద్రీయ విశ్వవిద్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన దీక్షా వేదిక వద్ద వైయస్ జగన్ ఉదయం 10.30 గంటల సమయంలో ఉత్సాహంగా దీక్షా వేదికకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య ప్రసంగిస్తూ జగన్ దీక్షతో ప్రభుత్వం దిగిరావడం ఖాయమన్నారు.
వైయస్ జగన్ చేపట్టిన జలదీక్షకు మద్దతు తెలిపేందుకు ఇక్కడికి వచ్చిన ప్రజలను, పార్టీ కార్యకర్తలనూ చూస్తుంటే, దీక్ష ప్రారంభం కాకుండానే విజయవంతమైందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన అక్రమ ప్రాజెక్టులను దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో ఎదుర్కొంటామని తెలిపారు.
రాష్ట్ర విభజన తర్వాత జగనన్న చేపట్టిన 27వ దీక్ష చంద్రబాబుకు కనువిప్పు కలిగించే దీక్ష కావాలని కోరుకుంటున్నట్టు వివరించారు. సోమవారం ప్రారంభమైన ఈ జలదీక్షలో భాగంగా వరసుగా మూడు రోజుల వైసీపీ అధినేత వైయస్ జగన్ దీక్షలో పాల్గొంటారు. దీక్ష కోసం జగన్ వేదిక వద్దకు చేరుకోగానే పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది.
దీక్ష ప్రారంభానికి ముందు దీక్షా వేదికపై ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి జగన్ నివాళులు అర్పించారు. ఈ జలదీక్షకు రాయలసీమ నుంచి వేలాదిగా ప్రజలు హాజరవుతారని అంచనాతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. జగన్ దీక్షకు మద్దతుగా వేలాదిమంది ప్రజలు తరలివచ్చారు.
దీక్షలో పాల్గొనేందుకు ఈరోజు ఉదయం జగన్ పులివెందుల నుంచి కర్నూలుకు బయల్దేరారు. ముందుగా పులివెందుల అమ్మవారి శాలలో ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలు నగరం చేరుకోగానే జగన్నాథగట్టు వద్ద ఆయనకు వైఎస్ఆర్ సీపీ నేతలు బుట్టా రేణుక, గౌరు చరితారెడ్డి, ఐజయ్య, మురళి తదితరులు ఘనస్వాగతం పలికారు.