'అందుకే జగన్ వద్దకు', చంద్రబాబు దృష్టి అంతా హెరిటేజ్ పైనే: అనంతలో పాదయాత్ర
చిత్తూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిది మోసపూరిత పాలన అని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి సోమవారం మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు 600కు పైగా హామీలు ఇచ్చారన్నారు. కానీ ఈ మూడున్నరేళ్లు, నాలుగేళ్లలో ఒక్క హామీని అమలు చేయలేదన్నారు.
జగన్కు గట్టి షాక్: వైసీపీ షరతులు, చంద్రబాబుపై పోటీ చేసిన నేత రాజీనామా, కంటతడి
కాపు, బోయ రిజర్వేషన్లపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని చెప్పారు. రిజర్వేషన్లు బుట్టదాఖలు చేసేందుకే ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు పాలన వల్ల సమస్యలతో విసిగిపోయిన ప్రజలు తమ గోడు చెప్పుకునేందుకు జగన్ వద్దకు వస్తున్నారని చెప్పారు.
అనంతపురంలో జగన్ పాదయాత్ర
కడప, కర్నూలు జిల్లాల్లో పాదయాత్ర ముగించుకున్న జగన్ సోమవారం అనంతపురం జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారు. ఆయనకు పలుచోట్ల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఆయన వద్దకు వచ్చి సమస్యలను చెప్పుకుంటున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే మీ సమస్యలు తీరుస్తామని చెబుతున్నారు.
హెరిటేజ్ లాభాలపైనే బాబు దృష్టి
జగన్ తన పాదయాత్రలో చంద్రబాబుపై మండిపడుతున్నారు. ఆదివారం కర్నూలు జిల్లాలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా బాబుపై విమర్శలు గుప్పించారు. హెరిటేజ్ లాభాల పైనే దళారీ సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారన్నారు. పోలవరం పూర్తి చేస్తేనే రాయలసీమకు మేలు జరుగుతుందన్నారు.
వైయస్సార్ బీమా
వ్యవసాయంలో నష్టాలు వచ్చి అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు బ్యాంకుల్లో ఉన్న అన్ని రకాల అప్పులను పూర్తిగా రద్దు చేస్తామని జగన్ అన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్సార్ బీమా కింద చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.5 లక్షలు నేరుగా ఒకేసారి అందిస్తామన్నారు. వ్యవసాయం లాభసాటిగా ఉండేలా ఉత్పత్తి వ్యయం తగ్గించేందుకు కృషి చేస్తామన్నారు.
చంద్రబాబు నిర్లక్ష్యం
వైయస్ హయాంలో చేపట్టిన నీటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నారని జగన్ విమర్శించారు. ఒకప్పుడు నాగార్జున సాగర్ కుడి కాల్వ కింద లక్షలాది ఎకరాల్లో వరి సమృద్ధిగా పండించే అన్నదాతలు ప్రస్తుతం నీరు లేక పంటలు వేయటం లేదన్నారు. పట్టిసీమ ఒట్టి సీమగా మారిందన్నారు. పట్టి సీమలో ఒక్క చెంబు నీరు పోసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని రైతులను మభ్య పెడుతున్నారన్నారు.
శిల్పా చక్రపాణి రెడ్డి అధ్యక్షతన సదస్సు
రాష్ట్రంలో దళారీ వ్యవస్థను చంద్రబాబు పెంచి పోషిస్తున్నారని, ఉప్పు, పప్పులు కూడా సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితుల్లో ఉన్నారని జగన్ అన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం వారి నుంచే సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. కాగా, శిల్పా చక్రపాణి రెడ్డి అధ్యక్షతన ఈ రైతు సదస్సు జరిగింది.