వైసీపీ నేత గుర్నాథ్ రెడ్డి హైద్రాబాద్లో అరెస్ట్, అనంత ఆగ్రహం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసన సభ్యుడు గురునాథ్ రెడ్డిని అనంతపురం పోలీసులు హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఆదివారం అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నేత ప్రసాద్ రెడ్డి హత్య అనంతరం తహసీల్దార్, ఎంపీడీఓ ఆఫీస్లకు నిప్పుపెట్టిన ఘటనలో గుర్నాథ్ రెడ్డి ప్రమేయం ఉందనే అభియోగంపై ఆయనను అరెస్టు చేశారు.
ఇదే కేసులో రాప్తాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నేత చంద్రశేఖర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. దాడులకు ప్రోత్సహించారని వీరి పైన కేసు నమోదయింది. ఈ రోజు (ఆదివారం) వీరిని అరెస్టు చేశారు. కాగా, మూడు రోజుల క్రితం రాప్తాడులో వైసీపీ నేత ప్రసాద్ రెడ్డిని ప్రత్యర్థులు హత్య చేసిన విషయం తెలిసిందే.
కాగా, గుర్నాథ్ రెడ్డి, చంద్రశేఖర రెడ్డిలను అరెస్ట్ చేయడాన్ని మాజీ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి ఖండించారు. ప్రసాద్ రెడ్డి హత్య విచారణను పక్కన పెట్టి పోలీసులు వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా పోలీసులు వింటున్నారన్నారు. వైసీపీని రాజకీయంగా ఎదుర్కోలేక టీడీపీ నేతలు భౌతిక దాడులకు దిగుతున్నారన్నారు.
రాజధానిపై మంత్రి నారాయణ
ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులను ఇతర పార్టీల నేతలు మోసపూరిత మాటలతో తప్పుదోవ పట్టిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ వేరుగా అన్నారు. సీఆర్డీఏ నిబంధనలను పరిశీలంచకుండానే 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వలేదంటూ కోర్టుకు తెలిపారన్నారు.
విజయనగరం విమానాశ్రయ నిర్మాణంపై సాంకేతిక నివేదిక ఇచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రతిపాదించిన ప్రాంతంలో సర్వే నిర్వహించాలని విజయనగరం, విశాఖ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం భోగాపురం విమానాశ్రయం భూసమీకరణపై విశాఖ, విజయనగరం జిల్లాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.