2018లో బడ్జెట్: మౌలిక వసతుల కోసం ఔషధ రంగం.. పసిడిపై కస్టమ్స్ తగ్గించాలి
న్యూఢిల్లీ: కొద్ది కాలంగా విదేశీ సంస్థల తనిఖీలు, అమెరికా మార్కెట్లో ధరల క్షీణత.. దేశీయంగా ధరల నియంత్రణతో ఔషధ పరిశ్రమ వచ్చే బడ్జెట్లో ప్రోత్సాహకాల కోసం ఎదురు చూస్తోంది. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు, నష్ట భయం (రిస్క్) అధికంగా ఉండే కొత్త ఔషధం అభివృద్ధిలో పెట్టుబడులను ఆకర్షించడానికి పన్ను మినహాయింపులు కోరుకుంటోంది. 'ఫార్మా విజన్ 2020'లో భాగంగా కొత్త ఔషధాల అభివృద్ధికి నిధులు సమకూర్చడం, మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని అభ్యర్థిస్తోంది.
ప్రైవేట్ కంపెనీలు చేపట్టే పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు గ్రాంట్ రూపంలో నిధులు, పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆకాంక్షలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం జీడీపీలో ఒక శాతం వ్యయం చేస్తున్న ఆరోగ్య సంరక్షణ కోసం 2.5 శాతం వరకు పెంచొచ్చని ఔషధ పరిశ్రమ భావిస్తోంది. ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వ వ్యయం పెరిగితే.. అది ఔషధ పరిశ్రమకు సానుకూలంగా పరిణమిస్తుందన్న అంచనాలు ఉన్నాయి.

పరిశోధన, అభివ్రుద్ధి వ్యయంపై ట్యాక్స్ డిడక్షన్ 200 శాతానికి పెంచాలి
జనరిక్స్ ఔషధాలను మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు జన్ ఔషధీ విక్రయ కేంద్రాలకు నిధుల కేటాయింపును పెంచొచ్చు. అమెరికా, ఐరోపా విపణులకూ తగినట్లు జనరిక్ ఔషధాల నాణ్యత పెంచడానికి, స్పెషాలిటీ ఔషధాల ఉత్పత్తుల వైపు కంపెనీలు మొగ్గు చూపడానికి వీలుగా పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు, కేంద్రాలు విస్తరించడానికి ప్రోత్సాహకాలు ప్రకటించే వీలుంది. సెజ్లపై విధిస్తున్న కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్)ను సమీక్షించవచ్చు. ఔషధ కంపెనీలు పరిశోధన, అభివృద్ధిపై చేసే వ్యయంపై ఇచ్చే వెయిటెడ్ ట్యాక్స్ డిడక్షన్ను గత బడ్జెట్లో 200% నుంచి 150 శాతానికి తగ్గించారు. 2020-21 నుంచి దీన్ని 100 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. దీన్ని మళ్లీ 200 శాతానికి పెంచాలని ఔషధ పరిశ్రమ కోరుతోంది. ప్రత్యేకించి ఔషధాల తయారీలో చైనాపై ఆధార పడకుండా దేశీయ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని ఇండియన్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐడీఎంఎ) కోరింది.

క్లినికల్ పరిశోధనలపై ట్యాక్స్ డిడక్షన్ వర్తింపజేయాలని ఔషధ రంగం
కాంట్రాక్టు పరిశోధన సంస్థలు చేపట్టే క్లినికల్ పరీక్షల నుంచి అన్ని విధాలుగా చేపట్టే పరిశోధన కార్యకలాపాలకు ట్యాక్స్ డిడక్షన్ వర్తింప చేయాలని పరిశ్రమ ప్రతినిధులు సూచిస్తున్నారు. ఔషధాల తయారీని ప్రోత్సహించడానికి ముడి ఔషధాలు, ఔషధాలు, బయోటెక్ ఔషధాల తయారీ యూనిట్ల లైసెన్సు నిబంధనలను సరళం చేయాలని పరిశ్రమ కోరుకుంటోంది. ముడి ఔషధాలకు చైనా, ఇతర దేశాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయ ముడి ఔషధాల తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ప్రపంచంలోని 20 అతిపెద్ద జనరిక్ ఔషధాల ఉత్పత్తి కంపెనీల్లో 6 భారత్లోనే ఉన్నాయి. ఏటా భారత ఔషధ పరిశ్రమ రూ.లక్ష కోట్లకు పైగా విలువైన ఔషధాలను ఎగుమతి చేస్తోంది. 50 శాతానికి పైగా ఎగుమతులు నిబంధనలు చాలా కఠినంగా ఉండే దేశాలకే వెళ్తున్నాయి. దేశంలో దాదాపు 3,000 ఔషధ కంపెనీలు ఉన్నాయి. అమెరికా కంటే దేశంలో ఔషధాల తయారీ వ్యయం 35-40 శాతం తక్కువగా ఉంటుంది.

2017 - 18లో 67 శాతం పెరిగిన పసిడి దిగుమతి
పసిడి రంగం క్రయ విక్రయాల్లో పారదర్శకత రావాలంటే, అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా దేశీయ ధరలు ఉండాలని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. దేశంలోకి దిగుమతి అవుతున్న బంగారంపై కస్టమ్స్ సుంకం 10%తో పాటు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) 3 % కలిపి 13 శాతం పన్ను అమలవుతోంది. తత్ఫలితంగా కస్టమ్స్ సుంకం ఎగవేత కోసం దొంగచాటుగా (స్మగ్లింగ్) తెచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. వారికి కిలోకు రూ.3 లక్షల వరకు మిగులుతోంది. ఇక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కలిగిన దేశాల నుంచి దిగుమతి చేసుకున్న పసిడిపై కస్టమ్స్ విధించడం లేదు. ఇలా దిగుమతి చేసుకున్నవారు, 3 శాతం జీఎస్టీ మాత్రమే చెల్లించి, విక్రయాలు జరిపిన వారున్నారు. ఈ రంగంలో పారదర్శకత తెచ్చేందుకు కస్టమ్స్ సుంకం తగ్గించాలని వర్తకుల సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో 25 వేల టన్నుల పసిడి వృథాగా ఉన్నదన్న అభిప్రాయం ఉన్నది. పసిడి దిగుమతులు 2016-17లో 500 టన్నులైతే, ఈ ఏడాది 67 శాతం పెరుగుతుందని అంచనా.

కస్టమ్స్ తగ్గించి జీఎస్టీ పెంచుకోవాలని బులియన్ వర్గాల సూచన
కస్టమ్స్ సుంకాన్ని నాలుగు శాతానికి పరిమితం చేస్తే అంతర్జాతీయ ధరలకు దగ్గరగానే దేశీయంగా లభిస్తుంది. ఫలితంగా దొంగచాటుగా తెచ్చేవారికి ప్రయోజనం ఉండదు. ఇందువల్ల అధికారిక విక్రయాలు పెరిగి, పన్ను రూపేణ ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. నల్లధనం చలామణి కూడా నివారించవచ్చు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుందని భావిస్తే, కస్టమ్స్ సుంకం తగ్గించి, జీఎస్టీ పెంచాలనే సూచనా బులియన్ వర్గాల నుంచి వస్తోంది. ఇందువల్ల ఏ రూపంలో దేశంలోకి ప్రవేశించినా, పన్ను ఆదాయం ప్రభుత్వానికి తగ్గదు. వృథాగా నిల్వ ఉన్న బంగారాన్ని చలామణిలోకి తెచ్చేందుకు, ప్రోత్సాహాలు పెంచాలి. ఆభరణాలను తాకట్టు పెట్టి, అవసరాలు తీరాక విడిపించుకోడానికి ఎక్కువమంది ఇష్టపడుతున్నారు కానీ, బ్యాంకులకు అప్పగించి, స్వల్ప వడ్డీ, గడువుతీరాక నగదు తీసుకునేందుకు సుముఖంగా లేరని ఒక నివేదిక తేల్చింది. అందువల్లే పసిడి నగదీకరణ పథకం పెద్దగా విజయవంతం కాలేదు. దీనిపై దృష్టి సారిస్తే, ఏటా దిగుమతుల కోసం భారీఎత్తున విదేశీ మారక ద్రవ్యం వినియోగించడం తగ్గుతుంది. మరోవైపు దేశీయ జెమ్స్ అండ్ జువెల్లరీ రంగంలో ఎగుమతులు, ఉద్యోగావకాశాలను పెంపొందించేందుకు కొత్తగా ఆభరణాల పార్కులను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో జువెల్లరీ డిజైనింగ్ ట్రైనింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.

హోటళ్లపై జీఎస్టీని హేతుబద్ధీకరించాలని వినతులు
భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న రంగాల్లో పర్యాటక, ఆతిథ్య రంగాలు కీలకం. వచ్చే ఏడేళ్లలో పర్యాటకులు 100 శాతం మేర వృద్ధి చెందొచ్చని అంచనాలు ఉన్నాయి. అధిక పన్నులతో పరిశ్రమ ఒడుదొడుకులు ఎదుర్కొంటుంది. కొత్తగా అమల్లోకి వచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానంతో పన్నులు.. విదేశీ మార్కెట్లతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 2018-19 సాధారణ బడ్జెట్పై ఈ రంగం చాలా ఆశలే పెట్టుకుంది. పర్యాటక, ఆతిథ్య రంగానికి మౌలిక రంగ హోదా కల్పిస్తే హోటళ్లు సులభంగా రుణాలు పొందడంతో పాటు వ్యయాలు తగ్గుతాయి. పర్యాటక సేవల ద్వారా ఆర్జిస్తున్న విదేశీ మారక ఆదాయాన్ని ఎగుమతులుగా పరిగణించాలని, వీటిపై 5 శాతం లోపు పన్ను ఉండాలి. హోటల్ గదులకు జీఎస్టీ కింద విధిస్తున్న నిర్దేశిత పన్నుల స్థానంలో వాస్తవిక ఛార్జీ విధింపు విధానాన్ని తేవాలని కోరుతున్నారు. జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరణపాటు రెస్టారెంట్ల పరిశ్రమలకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రయోజనాలను తిరిగి మదింపు చేయాల్సిన అవసరం ఉంది. హోటళ్లకు ఐజీఎస్టీ అమలు చేయాలి.

పర్యాటకులను ఆకర్షించేందుకు వీసా విధానం సులభతరం చేయాలి
భారత్లో చిన్న, మధ్య తరహా పర్యాటక వ్యాపారవేత్తల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి. ముద్రా కింద రుణాలు ఇవ్వాలి. విమానయాన రంగంలో ఎఫ్డీఐ పరిమితి పెంచినట్లుగానే.. పర్యాటకుల సంఖ్య పెంచేందుకు వీసా విధాన సులభతరం, మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు ప్రకటించాలి. జీడీపీలో పర్యాటక రంగ వాటా 10 శాతం. దేశంలో విదేశీ మారకం ఆర్జిస్తున్న వాటిలో ఈ రంగానిది మూడో స్థానం. 2016లో పర్యాటక, ఆతిథ్య రంగం ద్వారా జీడీపీకి 71.53 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరింది. 2027కు ఇది 147.96 బిలియన్ డాలర్లకు పెరగొచ్చు. 2016లో భారత్కు వచ్చిన విదేశీ పర్యాటకుల సంఖ్య 88 లక్షలు. ఇందులో బ్రిటన్, అమెరికా, బంగ్లాదేశ్ పర్యాటకులు మొదటి స్థానాల్లో ఉన్నారు.

జియో వల్ల టెలికం రంగంలో సంక్షోభం
దేశీయ టెలికాం రంగం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోందని 2017-18 ఆర్థికసర్వే విశ్లేషించింది. ముఖ్యంగా టెలికాంలోకి కొత్తగా ప్రవేశించిన రిలయన్స్ జియో మార్కెట్ సంక్షోభానికి కారణమైందని పేర్కొంది. ఇతర కారణాలతోపాటు టారిఫ్ వార్ టెలికాం సేవల సంస్థలను దెబ్బతీసిందని చెప్పడం విశేషం. భారీ అప్పులు, తారిఫ్ వార్, అసంబద్ధమైన స్పెక్ట్రం చార్జీలు టెల్కోలను దెబ్బతీశాయని సర్వే పేర్కొన్నది. టెలికాం మార్కెట్లో తక్కువ ధరలతో ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో వల్ల మార్కెట్లో సంక్షోభం ఏర్పడిందనీ, దీని వల్ల ఇతర కంపెనీల ఆదాయం పడిపోయిందని తెలిపింది. ఈ సంక్షోభం పెట్టుబడిదారులు, రుణదాతలు, భాగస్వాములతోపాటు ఈ టెలికాం కంపెనీల వెండర్లను తీవ్రంగా ప్రభావితం చేసిందని సర్వే పేర్కొంది. హేతుబద్ధమైన స్పెక్ట్రం వేలం, వేతన ఖర్చుల హేతుబద్ధీకరణ ద్వారా దీన్ని నియంత్రించాలని సర్వే సిఫార్సు చేసింది.కాగా సెప్టెంబర్ 2017 ముగిసే నాటికి, మొత్తం వినియోగదారుల సంఖ్య 1,207.04 మిలియన్లుగా ఉంది. అందులో 501.99 మిలియన్ కనెక్షన్లు గ్రామీణ ప్రాంతాలు నమోదు కాగా 705.05 మిలియన్ల కనెక్షన్లు పట్టణ ప్రాంతాలవి.

ఎంస్ఎంఇలను వెంటాడుతున్న రుణ కష్టాలు
దేశీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఇ) రుణ సేకరణలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, వ్యాపారం విస్తరించలేక పోతున్నారు. ఇప్పటివరకు మంజూరైన మొత్తం రుణాల్లో ఎంఎ్సఎంఇలకు ఇచ్చిన వాటా కేవలం 17.4 శాతమే. మన దేశంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డి) వ్యయం స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో 0.6 -0.7 శాతమే. గత 20 ఏళ్లుగా ఇదే పరిస్థితి. అమెరికా, చైనా, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్తో పోలిస్తే భారతదేశంలో ఖర్చు చాలా స్వల్పం. ఇదిలా ఉంటే ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.8 లక్షల కోట్ల రుణాలు మంజూరయ్యాయి. డిసెంబర్ 2017 నాటికి ముద్ర రుణాలు తీసుకున్నవారి సంఖ్య 10.1 కోట్లకు చేరుకుంది. అందులో 7.6 కోట్లు మహిళలే.

ప్రగతి బాటలో విమానయానం
దేశీయ విమాన రంగం మెరుగైన పురోగతి సాధిస్తోంది. విమాన టికెట్ల పరంగా భారత్ మూడో అతిపెద్ద మార్కెట్గా అవతరించింది. ఉడాన్ పథక అమలుతో ప్రాంతీయ మార్గాల్లో విమాన సేవలు ఊపందుకున్నాయి. ఇప్పటివరకు సర్వీసులు ఆరంభించని, చాలా తక్కువగా నడుస్తున్న ఎయిర్పోర్టులను ప్రధాన నగరాలతో అనుసంధానం చేయడంతోపాటు సామాన్యులకు సైతం విమాన సేవలను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2016-17లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 23.5 శాతం వృద్ధి చెందింది. అదే కాలానికి అమెరికాలో 3.3 శాతం, చైనాలో 10.7 శాతం వృద్ధి నమోదైంది. 2007-08 నుంచి 2016-17 మధ్యకాలంలో దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ ఏటేటా 9.89 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది.
వాణిజ్య వివాదాలను వాయిదా వేయకుండా సత్వరమే పరిష్కరించగలిగేలా ప్రభుత్వం, న్యాయవ్యవస్థ పరస్పర సహకారంతో చర్యలు చేపట్టాలి. తద్వారా వ్యాపార నిర్వహణకు అనుకూలమైన దేశాల జాబితాలో భారత్ స్థానం మరింత మెరుగుపడటంతోపాటు వాణిజ్య కార్యకలాపాలు మరింత పుంజుకునేందుకు అవకాశం ఉంటుంది.

పునరుత్పాదక రంగ రాయితీలరు పునఃసమీక్షించాలి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత మూడు త్రైమాసికాల్లో ఉక్కు ఎగుమతులు 52.9 శాతం వృద్ధి చెంది 76 లక్షల టన్నులకు పెరిగాయి. అంటే గత తొమ్మిది నెలల్లో ఉక్కు దిగుమతులు మాత్రం కేవలం 10 శాతం పెరిగాయి. అంతకు ముందు ఏడాదిలో ఇదేకాలానికి ఉక్కు ఎగుమతులు 49.75 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. ఈ మధ్యకాలంలో కేంద్రం చేపట్టిన పలు చర్యలు ఎగుమతుల వృద్ధికి దోహదపడ్డాయి. ఇదిలా ఉంటే సోలార్, హైడ్రో వంటి పునరుత్పాదక ఇంధన రంగాలకు కల్పిస్తున్న సబ్సిడీలు, రాయితీలపై పునః సమీక్ష జరపాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. సోలార్ ప్లాంట్ల నుంచి సరఫరా అయ్యే విద్యుత్ యూనిట్ ధర భారీగా తగ్గిన నేపథ్యంలో డిస్కమ్లు ప్రస్తుత పిపిఎ ఒప్పందాలపై మళ్లీ బేరమాడుతున్నాయి.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications