అంతర్గత నివేదిక, కీలక సూచనలు.. కోర్ కమిటీకి అమిత్ షా నిర్దేశం
పార్టీ శ్రేణులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని తెలంగాణ కోర్ కమిటీ నేతలకు సూచించారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు కార్యక్రమానికి హాజరయ్యేందుకు తెలంగాణకు వచ్చిన సంగతి తెలిసిందే. శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో పార్టీ తెలంగాణ కోర్ కమిటీ నేతలతో సమావేశం అయ్యారు.
తెలంగాణ శాఖకు అమిత్ షా పలు సూచనలు చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ నేతలకు సంబంధించి అంతర్గతంగా రూపొందించిన ఓ నివేదికను ప్రస్తావించారు. పలు కీలక సూచనలు కూడా చేశారు. కోర్ కమిటీ భేటీని ముగించుకున్న అమిత్ షా తుక్కుగూడలో జరిగే బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సమావేశానికి వెళ్తారు.
బీజేపీ తెలంగాణ ఇంచార్జీ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ కీలక నేత విజయశాంతిలతో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా తెలంగాణకు కూడా కేంద్రం నిధులు ఇస్తుందని చెప్పారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఇక్కడి ప్రభుత్వం మాత్రం ఏమీ ఇవ్వడం లేదని చెప్పడం మంచి పద్దతి కాదన్నారు. కేంద్రం ఏం ఇస్తుందనే అంశంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు. కేంద్ర పథకాలను సొంత డబ్బా కొడుతున్నారని.. జనాలకు చెప్పకుంటే వారు అదే నిజం అనుకుంటారని చెప్పారు. కేంద్రం ఏం చేసింది.. ఏం చేయబోతుంది అనే అంశాలకు సంబంధించి క్లారిటీ ఇవ్వాలని సజెస్ట్ చేశారు.