అవినీతి అక్రమాలు వద్దు.. పారదర్శకంగా సేవలు.. కొత్త అర్బన్ పాలసీపై కేసీఆర్ దిశానిర్దేశం
హైదరాబాద్ : అవినీతికి ఆస్కారం లేకుండా నూతన అర్బన్ పాలసీ రూపొందించాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యంగా రూపకల్పన చేయాలని సూచించారు. ప్రణాళికబద్దంగా అభివృద్ధి జరిగేలా కొత్త పాలసీని తీర్చిదిద్దాలని కోరారు. ఆ మేరకు ప్రగతిభవన్లో అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో దిశానిర్దేశం చేశారు. అర్బన్, రూరల్, రెవెన్యూ పాలసీలతో పాటు కార్పొరేషన్ల కోసం నూతన చట్టాల రూపకల్పనపై కీలక సూచనలు చేశారు.
కొత్త అర్బన్ పాలసీ.. ఇలా ఉండాలన్న కేసీఆర్
నూతన అర్బన్ పాలసీలో భాగంగా కొత్తగా మున్సిపల్ చట్టం, కార్పొరేషన్ చట్టం, హైదరాబాద్ నగర కార్పొరేషన్ చట్టం తీసుకురావాలన్నారు కేసీఆర్. దాని కోసం అర్బన్ పాలసీతో పాటు కొత్త రూరల్ పాలసీ, కొత్త రెవెన్యూ పాలసీ కూడా తయారు చేయాలని ఆదేశించారు. హెచ్ఎండబ్ల్యూఏతో పాటు ఇతర నగరాల అభివృద్ధి సంస్థల పాలనకు సంబంధించి కూడా కొత్త చట్టం తయారు చేయాలని సూచించారు.
ఎలాంటి ఆలస్యం జరగకుండా రెండు మూడు రోజుల్లోనే ఈ చట్టాలకు సంబంధించిన డ్రాఫ్ట్లు తయారు చేయాలని గడువు విధించారు. త్వరలోనే అసెంబ్లీని సమావేశ పరిచి కొత్త చట్టాలు అందుబాటులోకి తెచ్చే క్రమంలో అధికారులు ఆ పనిని వెంటనే పూర్తిచేయాలని సూచించారు.
ఏపీలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా పోయినట్లేనా.. బీజేపీ కన్నేసిందా.. ముహుర్తం ఎప్పుడంటే..!
అవినీతి అక్రమాలకు దూరంగా.. కొత్త చట్టాల రూపకల్పన..!
అక్రమ కట్టడాలకు ఏ మాత్రం వీలులేని విధంగా కొత్త చట్టాలు రూపొందించాలని ఆదేశించారు కేసీఆర్. అవినీతి జరగడానికి ఆస్కారం లేకుండా రూపొందించాలని సూచించారు. పచ్చదనం పరిశుభ్రత వెల్లివిరిసేలా నగరాలు, పట్టణాలను తీర్చిదిద్దడానికి ఉపయోగపడే విధంగా కొత్త చట్టాలు ఉండాలన్నారు. కొత్త చట్టాల ప్రకారమే నగర పాలన జరిగే విధంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ క్రమంలో అధికారులకు, నేతలకు బాధ్యతలు అప్పగించబోతున్నట్లు ప్రకటించారు.
అధికారులకు, లీడర్లకు బాధ్యతలు.. విస్మరిస్తే కఠిన చర్యలు..!
కొత్త చట్టాల ప్రకారం ఎవరికైతే బాధ్యతలు అప్పగిస్తామో వాళ్లు పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ వారు తమకు అప్పగించిన బాధ్యతలను విస్మరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా సదరు చట్టమే కల్పిస్తుందని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పరిస్థితిని చక్కదిద్దే బృహత్తర ప్రయత్నంలో కలెక్టర్లు క్రియాశీలక బాధ్యత పోషించాలని కోరారు. ఆ మేరకు కొత్త చట్టంలో నిబంధనలు పెడతామని తెలిపారు.
నిధుల వినియోగంలోనూ ఇష్టారాజ్యానికి చెక్ పెట్టనున్నట్లు చెప్పుకొచ్చారు కేసీఆర్. ఇకపై ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు నిధులు ఖర్చు చేయకుండా కొత్త చట్టంలో పొందుపరచనున్నట్లు తెలిపారు. ఆయా నగరాలు, పట్టణాల ప్రాధాన్యతలు, సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం మాత్రమే నిధులు వెచ్చించాలని అధికారులకు సూచించారు.