హుస్సేన్సాగర్లో జరిగినట్టే.. గోదావరి తీరాన కూడా.. : సీఎం కేసీఆర్
హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. హుస్సేన్ సాగర్లో రెగెట్టా పోటీలు ఎలా జరుగుతాయో.. అలాగే గోదావరిఖని వద్ద గోదావరి నదిలో కూడా నిత్యం అలాగే జరగాలని సీఎం కేసీఆర్.. పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్ను ఆదేశించారు.

గోదావరిఖని గోదావరిలోనూ..
‘తెలంగాణ మత్స్యవీర కేసీఆర్ కంప్' పేరిట గోదావరిఖని గోదావరి నది జలాల్లో తెలంగాణ రాష్ట్రస్థాయి తెప్పల పోటీలు నిర్వహించారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఈ క్రమంలో కోరుకంటిని సీఎం కేసీఆర్ అభినందించారు.
దండం పెట్టి నదిలో నాణేలు వేయాలంటే నీళ్ల కోసం వెతికిన కాలం నుంచి.. నేడు నిండు గోదావరిలా పడవల పోటీలు నిర్వహించే స్థాయికి తెలంగాణ ఎదిగిందని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఎమ్మెల్యేకు అభినందన
గోదావరి జలాల్లో పడవల పోటీలు నిర్వహించాలనే ఆలోచన వచ్చి, దాన్ని విజయవంతం చేసిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చొరవ అభినందనీయమని కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా సుందిళ్ల బ్యారేజీ నుంచి ఎల్లంపల్లి బ్యారేజీ వరకు 41 కిలోమీటర్ల మేర గోదావరి సజీవంగా ఉంటుందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.

జల క్రీడలకు అవకాశం..
నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా లేని సమయాల్లో జల క్రీడలకు ఎంతో అనుకూలంగా ఉంటుందని కేసీఆర్ అన్నారు. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని పర్యాటక, క్రీడారంగ అభివృద్ధికి కృషి చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.

హుస్సేన్సాగర్లోలానే..
హైదరాబాద్ హుస్సేన్సాగర్లో ప్రతియేటా రెగెట్టా పోటీలు జరుగుతాయని, అలాంటి పోటీలు నిర్వహించడానికి గోదావరిఖని వద్ద ఉన్న గోదావరి కూడా ఎంతో అనువుగా ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. నీటి పారుదల శాఖ, క్రీడా, సాంస్కృతిక శాఖ సంయుక్తంగా సెయిలింగ్ క్లబ్ వారి సహకారంతో పడవల పోటీలు నిర్వహించాలని, దీనికి వెంటనే కార్యాచరణ కూడా రూపొందించాలని సీఎం కేసీఆర్ సూచించారు.












Click it and Unblock the Notifications