లేఖాస్త్రం: ఫైర్ బ్రాండ్ మోహన్ బాబు లెటర్, సినిమాను బతికిద్దాం అంటూ.. ఏకిపారేసిన..
ఫైర్ బ్రాండ్ మోహన్ బాబు గళం విప్పారు. సినిమా టికెట్ల అంశంపై లేఖాస్త్రం సంధించారు. సినిమా ఇండస్ట్రీ అంటే కొందరే కాదు అంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తాను సినిమాకు పెద్దన్న పాత్ర పోషించలేను అని చిరంజీవి నుంచి ప్రకటన వచ్చిన తర్వాతే మోహన్ బాబు లేఖ బాంబ్ పేలింది. సినిమా టికెట్ల అంశానికి సంబంధించి ఇండస్ట్రీకి చెందిన కొందరు పెద్దలు ఏపీ మంత్రులతో చర్చలు జరిపారు. టికెట్ రేట్ గురించి మాట్లాడొద్దని దిల్ రాజు బహిరంగంగా చెప్పారు. సీనియర్ నటుడు మోహన్ బాబు మాత్రం సోషల్ మీడియా వేదికగా ఓ లెటర్ను షేర్ చేశారు.
కలిసి సినిమాను బతికిద్దాం..
కలసి సినిమాని బతికిద్దాం అంటూ మంచు మోహన్ బాబు బహిరంగ లేఖ రాశారు. మనకెందుకు అని మౌనంగా వుండాలా.. నా మౌనం చేతకానితనం కాదు.. కొంతమంది శ్రేయోభిలాషులు వద్దని వారించారని గుర్తుచేశారు. ఇండస్ట్రీ అంటే వేలమంది ఆశలు, కొన్ని వేల కుటుంబాలు.. వేల జీవితాలు. 47 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాట ఇదీ అని భావొద్వేగానికి గురయ్యారు. సినిమా ఇండస్ట్రీ సమస్యల గురించి సీఎంలకు వివరించాలనుకుంటే అందరూ కలిసి ఒక చోట సమావేశమై సమస్యలు ఏంటి, పరిష్కారాలు ఏంటి.. ఏది చేస్తే సినీ పరిశ్రమకి మనుగడ వుంటుంది అని చర్చించుకోవాలి. ఆ తర్వాత మాత్రమే సినిమాటోగ్రఫీ మంత్రుల్ని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసిగట్టుగా కలవాల్సి ఉండేనని చెప్పారు. నలుగుర్నే రమ్మన్నారు. ప్రొడ్యూసర్స్ నుంచి నలుగురు, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఓ ముగ్గురు, హీరోల నుంచి ఇద్దరు వెళ్లడం సరికాదన్నారు. పరిశ్రమలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు. అందరూ సమానం.. ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదు. చిన్న నిర్మాతల్ని కూడా కలుపుకోని వెళ్లాలని సూచించారు.
పార్టీలకు సంబంధం లేదు
పరిశ్రమలో ఒక పార్టీ వాళ్ళు ఉండొచ్చు, లేదా వేరు వేరు పార్టీల వాళ్ళు ఉండొచ్చు అది వాళ్ళ వ్యక్తిగతం, ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రుల్ని ముందుగా మనం కలవాలి... వాళ్ళని మనం గౌరవించుకోవాలి.. మన కష్టసుఖాలు చెప్పుకోవాలన్నారు. తాను మా అధ్యక్షుడిగా ఉన్న టైంలో సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖలందరిని కలుపుకొని ఒక్కటిగా వెళ్ళి అప్పటి రాజశేఖర్ రెడ్డిని కలిసి పైరసీ కోరల్లో సినిమా నలిగిపోతుంది, మా మీద దయచూపి బిక్ష పెట్టండి అనగానే, ఆ మాట చాలా మందికి నచ్చలేదు. కానీ ఆయన్ని కదిలించింది. చాలావరకు పైరసీని కట్టడి చేసింది, సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడే పనులు చాలావరకు అప్పటి ప్రభుత్వం చేసిందన్నారు.
అలా చిన్న సినిమాలకు నష్టమే..?
50 రూపాయలు, 30 రూపాయలు టికెట్ల రేట్లతో పెద్ద సినిమాలు నిలబడ్డం కష్టం. చిన్న సినిమాలు ఆడాలి.. పెద్ద సినిమాలు ఆడాలి.. దానికి సరైన ధరలు ఉండాలి. ముఖ్యమంత్రులను సినీ రంగం పరిస్థితి ఇది.., చిన్న సినిమాల్ని పెద్ద సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని మనకి న్యాయం చేయమని అడుగుదాం అని కోరారు. సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్ వున్నాయి.. అందరికీ దేవుళ్ళు నిర్మాతలు... ఆ నిర్మాతలు ఏమయ్యారు?. అసలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమస్యను భుజాల మీద వేసుకోకుండా ఎందుకు మౌనం వహిస్తుందో అర్ధం కావట్లేదని మోహన్ బాబు అన్నారు. ఒక్కటిగా ఉంటేనే సినిమా బతుకుతుందని బహిరంగ లేఖ పోస్ట్ చేశారు.