కాషాయ రక్తమే, అనాథ కాదు, రాజా సింగ్ భార్య ఉషా బాయ్
హిందూ దర్మ పరిరక్షణ కోసం రాజా సింగ్ పాటు పడతారని ఆయన భార్య ఉషా బాయి అన్నారు. ఆయనలో ప్రవహించేది కాషాయ రక్తమే అని హాట్ కామెంట్స్ చేశారు. గురువారం ఆమె మీడియాకు తెలియజేశారు. ఈ పోరాటంలో అండగా నిలిచిన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు.
దేశం కోసం.. ధర్మం కోసం..
బీజేపీ కార్యకర్తలకు, రాజాసింగ్ అభిమానులకు, ధర్మ రక్షకులకు నమస్కారాలను తెలియజేశారు. దేశం కోసం, ధర్మం కోసం కష్టపడి రాజా సింగ్ పనిచేశారని తెలిపారు. ఆ ధర్మం కోసం జైళ్లో ఉన్న సంగతి తెలుసు అని గుర్తుచేశారు. హిందూ సమాజం, బీజేపీ కార్యకర్తలు, రాజాసింగ్ అభిమానులు అండగా ఉంటూ ధైర్యాన్ని ఇచ్చారని పేర్కొన్నారు.
అనాథ కాదు..
రాజాసింగ్, ఆయన కుటుంబం అనాథ కాదని.. ఇంత పెద్ద హిందూ సమాజం తమకు అండగా ఉందన్నారు. హిందుత్వం పేరుతో కుట్రలు చేస్తున్నారని.. ఇలాంటి వారిపై పార్టీ కార్యకర్తలు, రాజాసింగ్ అభిమానులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ధర్మం కోసం ఎన్ని రోజులైనా జైల్లో ఉండేందుకు రాజా సింగ్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆయనకు జైళ్లు, కేసులు కొత్త కాదని హితవు పలికారు. రాజాసింగ్ క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్త అని.. ఆయన చేతిలో ఉండేది కమలం జెండానే.. ఆయనలో ప్రవహించేది కాషాయ రక్తమేనని స్పష్టంచేశారు. ధర్మ రక్షణ కోసం రాజాసింగ్ ఎన్ని బాధలు, కష్టాలు భరించడానికైనా సిద్ధంగా ఉన్నారని వివరించారు. అందరం సంఘటితంగా ఉండాలని.. ధర్మం పేరుతో కొందరు చేస్తున్న కుట్రలను తిప్పికొడదాం అని కోరారు.
పీడీ యాక్ట్ కింద అరెస్ట్
వివాదాస్పద వీడియో తర్వాత రాజా సింగ్ అరెస్టైన సంగతి తెలిసిందే. పీడీ యాక్ట్ కింద అరెస్టై చర్లపల్లి జైలులో ఉన్నారు. మునవర్ ఫారూఖీ షో వద్దన్నా హైదరాబాద్ లోని నిర్వహించడంతో వివాదం చెలరేగింది. ఎంఐఎం కోసమే టీఆర్ఎస్ హిందూ దేవుళ్లను కించపరుస్తున్న మునావర్ ను ఇక్కడికి పిలిచారని ఆరోపించారు.
యూట్యూబ్ లో వీడియో.. వివాదం
మునావర్ ఫారూఖీ హైదరాబాద్ లో ఆగస్టు 20వ తేదీన షో చేశారు. తర్వాత రాజాసింగ్ తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో విడుదల చేశారు. ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని.. ఆందోళనలు జరిగాయి. దీంతో బీజేపీ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఎందుకు సస్పెండ్ చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు ఆయనకు బెయిల్ మంజురు చేయడంతో పాతబస్తీలో మళ్లీ పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగాయి. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ప్రభుత్వం అతనిపై పలు కేసుల్లో పీడీ యాక్ట్ కింద అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఆయన భార్య మరోసారి మీడియా ముందుకు వచ్చి.. ఈ కామెంట్స్ చేశారు.