టీఆర్ఎస్ యువనేత మృతి.. గుండెపోటుతో కన్నుమూత
టీఆర్ఎస్ యువతనేత కొనమల్ల కుమార్ ఆకాల మరణం పొందారు. లింగోజిగూడ డివిజన్ యువ నేత, జీహెచ్ఎంసీ ఏరియా సభ్యుడుగా కొనసాగుతున్నారు. గుండెపోటుతో బుధవారం చనిపోయారు. ఛాతిలో నొప్పి రావడంతో రెండు రోజుల క్రితం స్థానిక ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. తర్వాత గచ్చిబౌలిలో గల ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. ఆయనను పరీక్షించిన వైద్యులు గుండెలో స్టెంట్ వేయాలని సూచించారు.
గురువారం ఉదయం చికిత్స చేయాల్సి ఉంది. అయితే తెల్లవారుజామున బాత్రూమ్కు వెళ్లిన కుమార్ అక్కడే కుప్పకూలిపోయారు. గుండెపోటుతోనే ఆయన చనిపోయారని వైద్యులు తెలిపారు. కుమార్ మృతితో విషాద వదనం నెలకొంది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమార్ పార్థీవదేహానికి ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు, వార్డు కమిటీ సభ్యులు మల్కాజ్గిరి కుమార్, పార్వతి, శ్రీధర్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు తిలక్రావు, కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దయానంద్ తదితరులు నివాళులు అర్పించారు.
Recommended Video
కుమార్ మృతితో ఆ కుటుంబం అండ కోల్పోయింది. తాము దిక్కులేని వారిని అయిపోయామని వారు అంటున్నారు. తమను ఆదుకోవాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. చిన్న వయస్సులోనే కుమార్ ఆకాల మృతి చెందారని.. ఆయనను పార్టీ ఆదుకోవాలని బంధువులు/ స్థానికులు కోరుతున్నారు. టీఆర్ఎస్ శ్రేణులకు ఇన్సూరెన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ నగదు కుటుంబసభ్యులకు అందుతుంది. కానీ హై కమాండ్ కూడా ఆర్థిక సాయం చేయాలని స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.