వనజీవి రామయ్యకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య అస్వస్థతకు గురయ్యారు. ఆయన కొంతకాలంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ గచ్చిబౌలిలోని ఏఎంజీ ఆస్పత్రిలో చేరారు. వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వనజీవి రామయ్యకు గతంలో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స కూడా జరిగిన సంగతి తెలిసిందే. రామయ్య అస్వస్థతకు గురికావడంతో తొలుత ఖమ్మం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్కు తరలించారు.
వనజీవి రామయ్య పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు. మొక్కలను చంటిపిల్లలా పెంచుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. ఇందుకుగానూ కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారం అందజేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయనను గౌరవించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ఆయన స్ఫూర్తితోనే తీసుకోవడం విశేషం.
ఖమ్మంలో గల తన నివాసంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో బంధువులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి రామయ్యను తీసుకు వచ్చారు. విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రకృతి ప్రేమికులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. రామయ్య ఆరోగ్య పరిస్థితిని బంధువులు, మీడియా ప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు. 50 ఏళ్ళ నుంచి వనజీవి రామయ్య మొక్కలు నాటుతునే ఉన్నారు. నిరంతరం మొక్కల గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 కోట్లకు పైనే మొక్కలు నాటారు. ప్రస్తుతం రామయ్య ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.