అర్ధరాత్రి హై టెన్షన్.. గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు సూసైడ్ అటెంప్ట్
Recommended Video
హైదరాబాద్ : గజ్వేల్ నియోజకవర్గంలో రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేస్తున్న ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ తరపున (ప్రజా కూటమి) వంటేరు ప్రతాప్ రెడ్డి బరిలో నిలిచారు. కేసీఆర్ గెలుపు కోసం టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందనేది వంటేరు ప్రధాన ఆరోపణ. ఈనేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
హైదరాబాద్ శివారులోని కొంపల్లిలో ప్రతాప్ రెడ్డి కుమారుడు విజయ్ రెడ్డి నివాసముంటున్నారు. సోమవారం అర్ధరాత్రి అనూహ్యంగా పోలీసులు విజయ్ రెడ్డి ఇంటిపై అటాక్ చేశారు. నగదుతో పాటు భారీగా మద్యం ఉందనే ఫిర్యాదుతో సోదాలు నిర్వహించామనేది పోలీసుల వాదన. అయితే ఇంట్లో ఎవరూ లేరని చెబుతున్నా తనిఖీల పేరిట ఇంట్లోకి చొరబడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సోదాల్లో నగదు గానీ మద్యం గానీ దొరక్కపోవడం గమనార్హం. విషయం తెలిసి అక్కడకు వంటేరు ప్రతాప్ రెడ్డి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరును నిరసిస్తూ ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు.
అర్ధరాత్రి హై టెన్షన్..! వంటేరు సూసైడ్ అటెంప్ట్
కొంపల్లిలోని ప్రతాప్ రెడ్డి కుమారుడు విజయ్ రెడ్డి ఇంట్లో నగదుతో పాటు మద్యం నిల్వలు భారీగా దాచారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఒకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా గజ్వేల్ లో వంటేరు అనుచరుడి దగ్గర 20 లక్షలు దొరికాయని.. ఇంకా పెద్దమొత్తంలో విజయ్ రెడ్డి ఇంట్లో దాచిపెట్టినట్లు ఆ కంప్లైంట్ సారాంశం. అందులోభాగంగానే ఆయన ఇంటిలో సోదాలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపిస్తున్న వంటేరు ప్రతాప్ రెడ్డి కేసీఆర్ ఆదేశాలతోనే పోలీసులు తనను వేధిస్తున్నట్లు వాపోతున్నారు.
రెండు మూడు రోజులుగా పోలీసులు తన వెంటే పడ్డారని ప్రచారం చేసుకోవడానికి వీలు లేకుండా చేస్తున్నారని మీడియాకు తెలిపారు. వంటేరు సూసైడ్ అటెంప్ట్ విషయం తెలియగానే ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అనుసరిస్తున్న తీరు సరికాదంటూ నినాదాలు చేశారు. దీంతో కొంపల్లిలో అర్ధరాత్రి టెన్షన్ వాతావరణం నెలకొంది.
కేసీఆర్ వర్సెస్ వంటేరు..! పోలీసులపై గుస్సా
2014 గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై పోటీ చేశారు వంటేరు ప్రతాప్ రెడ్డి. అప్పుడు ఆయన టీడీపీ నుంచి బరిలోకి దిగారు. వంటేరుపై 19,391 ఓట్ల మెజార్టీతో కేసీఆర్ విజయం సాధించారు. వంటేరుకు 67,303 ఓట్లు పడితే.. కేసీఆర్ కు 86,669 ఓట్లు వచ్చాయి. అయితే అప్పటినుంచి వీరిద్దరి మధ్య రాజకీయ వైరం ఎంతలా మారిందో అందరికీ తెలిసిందే.
ఈసారి ఎన్నికల్లో ప్రజా కూటమి తరపున పోటీ చేస్తున్న వంటేరు.. మొదటినుంచి కేసీఆర్ పై ఆరోపణలు గుప్తిస్తున్నారు. తాను గెలవకుండా కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ చెప్పుకొస్తున్నారు. తాజాగా ఆదివారం రాత్రి గజ్వేల్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో దీక్షకు దిగారు. తనతో పాటు అనుచరుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడంతో ఆ రోజు కూడా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లగానే సొమ్మసిల్లి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. కేసీఆర్ ఆదేశాలతోనే తనను వేధిస్తున్నారా అంటూ పోలీసులపై మండిపడ్డారు వంటేరు ప్రతాప్ రెడ్డి.
కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు.. పోలీసులపై ఈసీకి ఫిర్యాదు
గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో పోలీసులు, ఎన్నికల అధికారులు టీఆర్ఎస్ తో చేతులు కలిపారని వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈమేరకు సోమవారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాకు పలు విషయాలు వెల్లడించారు. గజ్వేల్ లో కాంగ్రెస్ కార్యకర్తలను హరీశ్ రావు భయపెడుతున్నారని ఫైరయ్యారు. గజ్వేల్ లో విజయం కోసం ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు 50 కోట్ల వరకు ఖర్చు చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ లో డబ్బులున్నాయని చెబుతున్నా కూడా పోలీసులు ఎందుకు తనిఖీలు చేయడం లేదని ప్రశ్నించారు. తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని, పోలీసులతో నిఘా పెట్టించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని టీఆర్ఎస్ నేతలపై ధ్వజమెత్తారు. కేసీఆర్ తరపున పోలీసులే నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు.