మోదీ ప్రభంజనం: ప్రతిపక్షాల హాహాకారాలు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ హవాతో బీజేపీ అద్భుతమైన విజయాలు సాధించింది. కాషాయం హవాలో ఒంటరిగా బరిలోకి దిగిన ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) చీపురు పంజాబ్లో నిరాశాజనక ఫలితాలు సాధిస్తే..
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ హవాతో బీజేపీ అద్భుతమైన విజయాలు సాధించింది. కాషాయం హవాలో ఒంటరిగా బరిలోకి దిగిన ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) చీపురు పంజాబ్లో నిరాశాజనక ఫలితాలు సాధిస్తే.. గోవాలో కనుచూపు మేరలో కాన రాలేదు.
జాతీయ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కూడా కనుమరుగు కాకుండా పంజాబ్ కాపాడింది. గోవా, మణిపూర్లలో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా సీట్లు గెలుచుకున్నాయి.
ఉత్తరప్రదేశ్ సీఎంగా అఖిలేశ్కు స్థానిక ప్రజాదరణను అధిగమించి విజయం సాధించిన క్రెడిట్ ప్రధాని మోదీదే. ఈ రెండు రాష్ర్టాల్లో విజయం ద్వారా బీజేపీ జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నది. గోవాలో 17 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.

మోదీ చరిష్మా ఇలా..
ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో ప్రధాని నరేంద్రమోదీ చరిస్మా సుస్థిరంగా, మరింత క్రియాశీలంగా మారిందని విశ్లేషకులు చెప్తున్నారు. 2014తో పోలిస్తే సీఎం అభ్యర్థిత్వం లేకుండా ఉత్తరప్రదేశ్తోపాటు ఉత్తరాఖండ్లో బీజేపీ భారీ మెజారిటీతో సాధించిన విజయానికి తోడు మిగతా రాష్ట్రాల్లోనూ కొనసాగించిన హవా అత్యుత్తమమని అభిప్రాయ పడుతున్నారు. తదుపరి హిమాచల్ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరంలో తేలిగ్గా బీజేపీ ముందడుగు వేసేందుకు మార్గం సుగమమైంది.

కాంగ్రెస్ విముక్త భారత్పై బీజేపీ ఇలా..
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)కి జూనియర్ భాగస్వామిగా మారిన కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్లో ఓటమి పాలైనా.. పంజాబ్లో పూర్తిస్థాయి మెజారిటీ సాధించింది. గోవా, మణిపూర్లలో బీజేపీ ముఖాముఖీ పోటీ పడింది. గుజరాత్లో అధికారం నిలబెట్టుకోవడంతోపాటు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించడమే కమలనాథుల ముందు మిగిలి ఉన్న లక్ష్యం. ఎన్నికల ఫలితాల్లో గెలుపుతో బీజేపీ సంబురాలు చేసుకోవచ్చుగానీ కాంగ్రెస్ రహిత భారత్ రూపొందించాలన్న కల సాకారం కాలేదు.

ఇదీ కేజ్రీవాల్ దుస్థితి..
జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని కలలు కన్న ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు ఈ ఎన్నికలు గట్టిఎదురు దెబ్బ భావించొచ్చు. దేశ రాజధాని ఢిల్లీ తర్వాత పంజాబ్లో అధికారానికి దగ్గరవుతామని భావించిన ఆప్ మూడోస్థానానికి పరిమితం అయ్యింది. పదేండ్ల పాలనలో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా శిరోమణి అకాలీదళ్ బీజేపీ కూటమి రెండోస్థానంలో నిలిచింది.

నోట్ల రద్దుపై ఇలా..
పెద్దనోట్ల రద్దు వల్ల ఆర్థిక లబ్ధి చేకూరుతుందా? లేదా? అన్న విషయం తేలకున్నా.. రాజకీయంగా సత్ఫలితాలను ఇస్తుందని రుజువుచేసింది. మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత మహారాష్ట్ర, ఒడిశా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించారు. తాజాగా యూపీ, ఉత్తరాఖండ్ రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించడంతో నోట్ల రద్దు సరైందని ప్రజలు తీర్పు ఇచ్చినట్లయింది.

ఇదీ ప్రాంతీయ నేతల దుస్థితి
మరోవైపు ప్రధాని మోదీ సునామీ ముందు దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్లోని మాయావతి, అజిత్సింగ్ వంటి ప్రాంతీయ నేతలు మనుగడ సాధించడం కష్టమే. కాకపోతే సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడిగా అఖిలేశ్ యాదవ్ పోరాడేందుకు చాన్స్ ఉంది. కానీ బీఎస్పీ అధినేత మాయావతి, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ (ఆర్ఎల్డీ) అధ్యక్షుడు అజిత్సింగ్ వంటి వారు.. మోదీమయమైన భారత జాతీయ రాజకీయాల్లో వారు తమ సంప్రదాయ రాజకీయాలకు మెరుగులు పెట్టుకోవాల్సి ఉంది.

ఇదీ రాజ్యసభలో బీజేపీ పరిస్థితి
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాది నుంచి రాజ్యసభలో బలాబలాల్లో మార్పులకు దారి తీస్తాయి. ఎగువసభలో సాధారణ మెజారిటీ కావాలంటే 123 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం బీజేపీ, దాని మిత్రపక్షాల బలం 75 మంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో 68 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. వాటిలో పది స్థానాలు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల నుంచి కాగా, మిగతా 58 స్థానాలు ఢిల్లీ, కేరళ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, గుజరాత్, తెలంగాణ, రాజస్థాన్, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యా నా, సిక్కిం రాష్ర్టాల నుంచి భర్తీ అవుతాయి. తద్వారా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేకు మెజారిటీ పెరుగుతుంది. దీనికి తోడు నామినేటెడ్ సభ్యులు సచిన్ టెండూల్కర్, రేఖ తదితరుల పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్లో ముగియనున్నది. తద్వారా మరో నలుగురు సభ్యులను రాష్ట్రపతి ఎగువసభకు నామినేట్ చేస్తారు. నామినేటెడ్ సభ్యులకు విప్ వర్తించకున్నా.. ఎగువసభలో అధికార పక్షానికి మద్దతు పలుకుతారు. యూపీ గెలుపుతో వచ్చే ఏడాది ఖాళీ అవుతున్న పది స్థానాలను బీజేపీకి దక్కనున్నాయి.

ఇలా ప్రణబ్ వారసుడిగా ఎన్నిక..
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో త్వరలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో కాషాయ పార్టీకి చాలా వెసులుబాటు లభించింది. ఎన్నికల్లో యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఘన విజయం వల్ల రాష్ట్రపతి ఎన్నికల ‘ఎలక్టోరల్ కాలేజీ'లో బలాబలాల పొందికలో మార్పు రానున్నది. ఇక గోవా, మణిపూర్ రాష్ట్రాల్లోనూ గణనీయంగానే సీట్లు సాధించడం బీజేపీకి కలిసొచ్చే అంశమే.

ఆర్థిక సంస్కరణలకు
దేశ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు ప్రారంభించి 25 ఏళ్లవుతున్నా కీలక చట్టాలు సవరణకు నోచుకోనే లేదు. ప్రత్యేకించి కార్మిక చట్టాల్లో సమూల మార్పులు తేవడానికి మోదీ సర్కార్ భారీ వెసులుబాటు లభించినట్లయింది. ఇక తాజాగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ప్రశాంతంగా అమలు చేయడానికి మార్గం సుగమమైనట్లే.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications