మావోయిస్టులకు భారీ దెబ్బ, ఎన్కౌంటర్లో 16 మంది మృతి
గడ్చిరోలి: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్రలోని గడ్చిరౌలిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 16 మందికి వరకు మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య చాలాసేపు ఎదురుకాల్పులు జరిగాయి. ఇటీవలి కాలంలో మావోయిస్టులకు ఇది అతి పెద్ద దెబ్బగా చెబుతున్నారు. నాలుగేళ్లలో అతిపెద్ద ఆపరేషన్. మృతుల్లో ఒకరు తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లావాసి ఉన్నట్లుగా తెలుస్తోంది.
మృతుల్లో ఇద్దరు డివిజినల్ కమిటీ సభ్యులున్నారు. రాత్రి పొద్దుపోయేక నక్సల్స్ ప్రతీకార దాడులు జరిపే ప్రమాదం ఉందని అనుమానించిన పోలీసులు అడవిలో కూంబింగ్ నిర్వహించారు. మహారాష్ట్ర పోలీసులకు అందిన సమాచారంతో ఆదివారం ఉదయం నక్సల్ వ్యతిరేక ప్రత్యేక దళానికి చెందిన సీ60 కమాండోలు గడ్చిరోలి జిల్లా భామరాగడ్ మండలం తాడ్గావ్కు సమీపాన గల అటవీప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు.
ఎటాపల్లి బొరియ అటవీప్రాంతంలో వీరికి పెరిమిలి దళం కంటబడింది. పోలీసులకు, నక్సల్స్కు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 16 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్లో పదహారు మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ఐజీ శరద్ శేలార్ తెలిపారు. అడవుల్లో 50 నుంచి 60 మంది వరకు నక్సల్స్ సమావేశమయ్యారనే సమాచారం రాావడంతో రంగంలోకి దిగామన్నారు.
ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా మందుగుండు సామగ్రి, ఎస్ఎల్ఆర్, ఏకే47 తుపాకులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఘటనలో పలువురు మహిళా మావోయిస్టులతో పాటు డివిజినల్ ఏరియా స్థాయి నిర్వాహకులు ఉన్నటు తెలిపారు. వీరిలో ఒకరిపై రూ.16 లక్షల పారితోషికం కూడా ప్రకటించామన్నారు. అడవిలో వర్షం కురుస్తున్నందున మృతదేహాల తరలింపులో జాప్యం జరుగుతోందని చెప్పారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను అభినందించిన ఆయన వారికి పదోన్నతులు కల్పిస్తామన్నారు.