2 రెండు వారాలు జాగ్రత్త.. బయటకు రావొద్దు, ప్రజలకు ఐఎండీ సూచన
ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి బయటకు వెళ్లొద్దని వాతావరణ నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు. సాయంత్రం 4, 5 గంటల వరకు ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏప్రిల్ తొలి 15 రోజుల పాటు ఎండలు మండిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. బుధవారం వరకు పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది.
హిమాలయ పర్వతాల్లో ఈసారి ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఇలాంటి వాతావరణంతో అడవుల్లో కార్చిచ్చు అంటుకునే అవకాశాలూ ఉన్నాయని సూచించింది. అటవీ శాఖ అప్రమత్తం చేసింది. ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో ఇటీవల 41 డిగ్రీలకు మించి ఉష్ణోత్రలు నమోదయ్యాయి. 122 ఏళ్ల తర్వాత దేశంలో గత నెలలో అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 1901 తర్వాత మార్చిలో 33.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. 2010లో నమోదైన 33.09 డిగ్రీల రికార్డు చెరిగిపోయింది. ఎండల ప్రభావం ఏప్రిల్లో ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇటు తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ తీపికబురు అందించింది. వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. మరఠ్వాడా నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటలకే ఎండ వేడిమి.. ఉక్కపోత మొదలవుతుంది. దీంతో ఉదయం 11 గంటల్లోపే ఇళ్లకు చేరాలని సూచిస్తున్నారు. వడగాలులు వీస్తోన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఈ సారి అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో అంతా కేర్ ఫుల్గా ఉండాలని కోరుతుంది.