వేధింపులు: ముగ్గురు వైద్యవిద్యార్థినుల ఆత్మహత్య
చెన్నై: తమిళనాడులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కళాశాలకు చెందిన ముగ్గురు వైద్య విద్యార్థినులు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విల్లుపురంలోని ఎస్వీఎస్ సిద్దా మెడికల్ కాలేజ్ ఆప్ నాచురోపతి అండ్ యోగా సైన్సెస్కు చెందిన ఆ విద్యార్థినుల మృతదేహాలు కళాశాల సమీపంలోని వ్యవసాయ బావిలో లభించాయి.
తమ ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యం, ముఖ్యంగా చైర్పర్సన్ కారణమంటూ విద్యార్థినులు రాసిన ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కాలేజీలో 50 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే కళాశాల యాజమాన్యం కళాశాలలో కనీస వసతులు కల్పించడంలో విఫలమైంది.
ఇందువల్ల కొన్ని నెలల క్రితం ఆ కళాశాల తన గుర్తింపును కోల్పోయింది. దీంతో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకరమవుతుందని కుమిలిపోయిన విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. అయినప్పటికీ యాజమాన్యం తీరులో మార్పు రాకపోవడంతో మనస్తాపానికి గురైన శరణ్య (19), ప్రియాంక (19), మోనీషా (19) అనే ముగ్గురు విద్యార్థినులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.
కనీస వసతులు సైతం కల్పించకుండానే ఆ కళాశాల యాజమాన్యం భారీ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తోందని, కట్టనివారిని వేధింపులకు గురిచేస్తోందని విద్యార్థినుల ఆత్మహత్యకు ఇదే కారణమనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రాణాలు తీసుకునేముందు విద్యార్థినులు రెండు పేజీల సూసైడ్నోట్ రాసినట్టు సమాచారం.
ఆ లేఖలో వారు.. కళాశాల యాజమాన్యం విద్యార్థుల నుంచి రూ.6 లక్షల దాకా ఫీజులు వసూలు చేస్తోందని, చైర్మన్ భార్య వాసుకి సుబ్రమణియన్ వేధింపులకు గురి చేస్తున్నారని కూడా పేర్కొన్నట్టు తెలుస్తోంది. అంత డబ్బు వసూలు చేసినా సరైన ఫ్యాకల్టీని ఏర్పాటు చేయలేదని, సౌకర్యాలు కల్పించలేదని.. అసలు ఆ కాలేజీలో నేర్చుకోవడానికి ఏమీ లేదని ఆరోపించారని సమాచారం.
‘మా ఆత్మహత్య గురించి తెలిశాక ఆమె(వాసుకి సుబ్రమణియన్) మా నడవడికను చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. కానీ, దయచేసి ఆవిడను నమ్మవద్దు. ఆవిడపై దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోండి. మా ఆత్మహత్యతోనైనా అధికారులు కళ్లు తెరిచి కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం' అని విద్యార్థినులు లేఖలో రాసినట్టు తెలిసింది.
విద్యార్థినుల ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను బావిలోంచి వెలికి తీశారు. కళాశాల నిర్వాహకుల్లో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్టు విల్లుపురం డీఐజీ అనీష్ హుస్సేన్ తెలిపారు. కాగా, రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు కళాశాల యాజమాన్యం తీరును ఖండించాయి. మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, కళాశాలపై దర్యాప్తు జరపాలని డిమాండు చేశాయి.
ఇది ఇలా ఉండగా, కళాశాల చైర్మన్ సుబ్రమణియన్ అనారోగ్యం కారణంగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చెన్నైలో ఉన్నా ఆయనను కూడా విచారిస్తామని అనీష్హుస్సేన్ తెలిపారు. విద్యార్థుల మృతికి కారణమైన వైద్యకళాశాలపై విచారణ జరిపేందుకు సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేశామని, ఆరోపణలు రుజువైతే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ తెలిపారు.