ఢిల్లీలో షూట్ ఔట్, ముసుగుతో వచ్చి కాల్పులు: యువకుడి బలి
న్యూఢిల్లీ: భారత రాజధాని ఢిల్లీలో షూట్ఔట్ జరిగింది. సౌత్ ఢిల్లీలోని కుతుబ్ మినార్ ప్రసిద్ది చెందిన కట్టడం. ఈ కట్టడం చూడటానికి నిత్యం పర్యాటకులు వేలసంఖ్యలో వస్తుంటారు. ఢిల్లీవాసులు తీరిక దొరికిన సమయంలో ఈ కుతుబ్ మినార్ దగ్గరకు వచ్చి సేద తీరుతుంటారు.
మంగళవారం ఈ కట్టడం దగ్గర చాలామంది పర్యాటకులు వచ్చారు. ఆ సమయంలో కారులో ముసుగులు వేసుకుని వచ్చిన కొందురు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ సందర్బంలో పర్యాటకులు ప్రాణభయంతో ఇష్టం వచ్చినట్లు పరుగు తీశారు. ఈ కాల్పులలో ఒకరు మరణించారు. ఒకరికి తీవ్రగాయాలైనాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. దుండగుల చేతిలో హత్యకు గురైన యువకుడు సోను సోజ్ వాల్ (25) అని వెలుగు చూసింది. ఇతని స్నేహితుడు సందీప్కు తీవ్రగాయాలు కావడంతో సిటీ ఆసుపత్రికి తరలించారు. సోను, సందీప్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.
మంగళవారం వీరిద్దరు సెంట్రల్ ఢిల్లీలోని ఒక స్టార్ హోటల్ దగ్గర నుండి వెళ్తున్నారు. కుతుబ్ మినార్ సమీపంలో వెళ్తున్న సమయంలో కారులో ముసుగులు వేసుకుని వచ్చిన 8మంది ఒక్కసారిగా కాల్పులు జరిపారని, ఈ దాడిలో బుల్లెట్లు దూసుకు వెళ్లి సోను సెజ్ వాల్ (28) సంఘటనా స్థలంలో మరణించాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది.
ఆస్తి వివాదం కారణంగా సోను, సందీప్ల మీద కాల్పులు జరిపారని పోలీసులు అంటున్నారు. సందీప్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడని, అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. సందీప్ కోలుకున్న తర్వాతకాల్పులు జరిపింది ఎవరనేది కచ్చితంగా తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
కుతుబ్ మినార్ దగ్గర, పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో ముసుగులు వేసుకుని వచ్చి కాల్పులు జరిపిన దృశ్యాలు రికార్డు అయ్యాయని పోలీసులు చెప్పారు. కాల్పులు జరపడానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, సోను కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పోలీసులు అన్నారు. కాల్పులు జరిపిన దుండగులను త్వరలో అరెస్టు చేస్తామని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.