'సమాచారం మేరకు తెలుగుదేశం పార్టీలోకి మోడీ, దీనిని వార్త చేయండి'
'విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ టిడిపిలో చేరుతున్నారు. ఇక దీనిని వార్త చేయండి. కేవలం మీలాగే జోక్ చేస్తున్నా' ఇదీ ఏఏపీ నేత కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్య.
న్యూఢిల్లీ: 'విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఇక దీనిని వార్త చేయండి. కేవలం మీలాగే జోక్ చేస్తున్నా' ఇదీ ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్య.
ఆయన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరుతారని ప్రచారం జరిగింది. అతను బీజేపీతో మంతనాలు సాగిస్తున్నారని, ఆయన కమలం పార్టీలో చేరి, ఉత్తర ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లో సహిదాబాదు నుంచి పోటీ చేయనున్నారని ఊహాగానాలు వచ్చాయి.
కుమార్ విశ్వాస్తో చర్చలు ప్రథమ దశలో ఉన్నాయని బీజేపీ సోర్సెస్ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను కలిసి, తన చేరిక విషయమై స్పష్టం చేస్తారని వచ్చింది. దీనిపై కుమార్ విశ్వాస్ బుధవారం స్పందించారు.
.@akhileshsharma1 @ArvindKejriwal Yes,according to sources PM joining TDP,now run this as a news.Just joking like u guys😜
— Dr Kumar Vishvas (@DrKumarVishwas) January 18, 2017
తాను బీజేపీలో చేరుతానని వచ్చిన వార్తలన్నీ పుకార్లేనని, తాను పార్టీ మారడం లేదని చెప్పారు. అలా అయితే, తనకు వచ్చిన సమాచారం మేరకు మోడీ టిడిపిలో చేరుతున్నారని, దీనిని మీరు వార్త చేయండని, మీలాగే నేను జోక్ చేస్తున్నానని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.
అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోడీ సెన్సాఫ్ హ్యూమర్ పెంచుకోమని సూచిస్తే, ఆయన అభిమానులు మాత్రం దానిని సెన్స్ ఆఫ్ రూమర్గా తీసుకున్నారని వెటకారం చేశారు.
मेरे पास तो खबर है कि यूपी चुनाव के बाद प्रधानमंत्री जी कांग्रेस में शामिल होने जा रहे हैं. उनकी राहुल गांधी से मुलाक़ात भी हो चुकी है!! https://t.co/iEYXQGbyLh
— Manish Sisodia (@msisodia) January 18, 2017
కాగా, కుమార్ విశ్వాస్ బీజేపీలో చేరుతారనే వార్తలను ఏఏపీ నేతలు మనీష్ సిసోడియా, కపిల్ మిశ్రాలు కూడా కొట్టిపారేశారు. పుకార్లు పుట్టించారంటూ మోడీ, అమిత్ షాల పైన కూడా జోక్ చేశారు.
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తన వద్ద సమాచారం ఉందని, ఆయన రాహుల్ గాంధీని కూడా కలిశారని మనీష్ సిసోడియా చమత్కరించారు. అమిత్ షా ఆమ్మ ఆద్మీ పార్టీలో చేరుతున్నారా అంటూ కపిల్ మిశ్రా వ్యాఖ్యానించారు.