డీఎంకే కోటల్లో జయలలిత పాగా
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు కావాల్సిన సీట్లను దక్కించుకునే దిశగా సాగుతున్నారు ఏఐఏడీఎంకే అధ్యక్షురాలు జయలలిత. తమిళనాడు మొత్తం అసెంబ్లీ సీట్లు 234లో 129 సీట్లలో జయలలిత పారీ ఆధిక్యం కొనసాగుతోంది.
కాగా, డీఎంకే గత ఎన్నికల్లో తమ ప్రభావాన్ని చూపిన నియజకవర్గాల్లోనూ ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే తన సత్తాను చాటుకుంది. కరుణానిధి పార్టీకి పట్టున్న నియోజకవర్గాల్లో సైతం జయలలిత పార్టీ పాగా వేసింది.
డా. ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జయలలిత ప్రత్యర్థి, డీఎంకే అభ్యర్థి షిమ్లా ముత్కోజన్పై 16వేల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ఆమె విజయం ఖాయమే అని చెప్పుకోవచ్చు. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించిన జయలలిత తమిళనాడులో వరుసగా రెండోసారి సీఎంగా ఎన్నికైన మహిళగా రికార్డు సృష్టించారు.
తమిళ ఓటర్లు ఒకసారి జయను గెలిపిస్తే.. మరోసారి కరుణానిధిని.. అలా మార్చుతూ గెలిపించేవారు. కానీ, ఈసారి జయలలితను రెండోసారి సీఎంగా ఎన్నుకోవడం గమనార్హం. కెప్టెన్ విజయకాంత్ ఈ ఎన్నికల్లో చక్రం తిప్పుతారనుకుంటే ఒక్కసీటు గెల్చుకోకుండా తీవ్రంగా విఫలమయ్యారు. ఏఐఏడీఎంకేకు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది కెప్టెన్ కూటమి.
పీఎంకే చీఫ్ రామదాస్ ఒంటరిగా బరిలోకి దిగి తన సొంత సీటును కూడా గెలుపించుకునే స్థితిలో లేకుండా పోయారు. డీఎంకే-కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ.. అవినీతి, కుంభకోణాల ఆరోపణల నేపథ్యంలో ఓటర్లు జయకే మరోసారి పట్టం కట్టేందుకు సిద్ధపడ్డట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కరుణానిధికి బాగా పట్టున్న ప్రాంతాల్లో కూడా అన్నాడీఎంకే విజయాలు సాధించింది. తిరువరూర్ నుంచి పోటీ చేస్తున్న డీఎంకే చీఫ్ కరుణానిధి తన ప్రత్యర్థి, ఏఐఏడీఎంకే అభ్యర్థి ఏఎన్ఆర్ పన్నీర్సెల్వంపై 29,372 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.
కాగా, డీఎంకే 100 స్థానాల్లో ఆధిక్యాన్ని చూపిస్తుండగా, ఏఐఏడీఎంకే 126 సీట్ల ఆధిక్యంతో దూసుకుపోతోంది. కాగా, జయలలిత విజయం ఖరారు కావడంతో ప్రధాని నరేంద్ర మోడీ.. ఫోన్ ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ట్విట్టర్ ద్వారా కూడా శుభాకాంక్షలు తెలిపారు.
ఏఐఏడీఎంకే విజయం ఖరారు కావడంతో తమిళనాడు రాజధాని చెన్నైతోపాటు అన్ని ప్రాంతాల్లో పార్టీ అభిమానులు, కార్యర్తలు స్వీట్లు పంచుకుంటూ నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన పెద్ద టెలివిజన్ స్క్రీన్ ద్వారా జయలలిత మాట్లాడారు.
'తమిళనాడు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే తాను ప్రతిక్షణం పని చేస్తుంటా' అని ఆమె స్పష్టం చేశారు. గురువారం 12.30గంటల ప్రాంతానికి 138 స్థానాల్లో ఆధిక్యంతో అన్నాడీఎంకే దూసుకుపోతుండగా, 93 స్థానాలకే డీఎంకే పరిమితమైంది.