తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వమే ఉంటుంది: క్లారిటీ ఇచ్చిన స్పీకర్!
చెన్నై: తమిళనాడులో ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం ఉంటుందని, అందులో ఎలాంటి సందేహం లేదని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ అన్నారు. బుధవారం తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ మీడియాతో మాట్లాడారు. తమిళనాడు ప్రభుత్వం విషయంలో మీడియా ఆయనను ప్రశ్నించింది.
పేరుకు మాత్రమే సీఎం వెంట ఎమ్మెల్యేలు: మావైపు 40 మంది వస్తారు: టీటీవీ దినకరన్ గ్యాంగ్!
శాసన సభలో ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకుంటుందా ? అని మీడియా ప్రశ్నిస్తే ప్రస్తుతానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని అన్నారు. ఎడప్పాడి పళనిసామికి ఎమ్మెల్యేల మద్దతు ఉందని స్పీకర్ ధనపాల్ చెప్పారు.
శాసన సభలో ఎడప్పాడి పళనిసామి బలపరీక్ష నిరూపించుకోవాలంటే గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని స్పీకర్ ధనపాల్ గుర్తు చేశారు. ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన 19 మంది అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామని, ఇంత వరకూ వారు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని స్పీకర్ ధనపాల్ వివరించారు. బలపరీక్ష నిర్వహించడానికి గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ తిరస్కరించిన రోజే స్పీకర్ ధనపాల్ ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని చెప్పడం కొసమెరుపు.