ఫినిష్: చిన్నమ్మ శశికళ, ఇళవరసి మీద సీబీఐ కేసు, రూ. వెయ్యి కోట్ల బోగస్ కంపెనీలు, విదేశాల్లో!
బెంగళూరు/చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళ, ఆమె వదిన ఇళవరసిలను అవసరమైతే అరెస్టు చేసి విచారణ చేస్తామని సీబీఐ అధికారులు అంటున్నారు. దాదాపు రూ. 1, 000 కోట్లకు పైగా అవకతవకలు జరిగాయని ఐటీ శాఖ అధికారుల విచారణలో వెలుగు చూసిందని మాకు సమాచారం వచ్చిందని సీబీఐ అధికారులు అంటున్నారు.
Recommended Video
అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ, ఆమె కుటుంబ సభ్యులు, మన్నార్ గుడి మాఫియా, వారి అనుచరుల ఇళ్లలో, కార్యాలయాల్లో నవంబర్ 9వ తేదీ నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసిన విషయం తెసిందే. ఆ సందర్బంలో ఐటీ శాఖ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
మన్నార్ గుడి ఫ్యామిలీ
శశికళ మేనల్లుడు, జాజ్ సినిమాస్ సీఇవో, జయ టీవీ ఎండీ వివేక్, ఇళవరసి కుమార్తెలు కృష్ణప్రియ, షకీల, టీటీవీ దినకరన్, దివాకరన్, అమ్మ జయలలిత వ్యక్తి గత వైద్యుడు డాక్టర్ శ్రీనివాసన్, చిన్నమ్మ మద్యం కంపెనీ మిడాస్ కార్యాలయం, బెంగళూరులోని చిన్నమ్మ అనుచరుడు పూహళేంది నివాసం, కార్యాలయం తదితర 187 చోట్ల ఐటీ శాఖ సోదాలు జరిగాయి.
రూ. 1, 430 కోట్ల అక్రమాస్తులు
శశికళ కుటుంబ సభ్యులను లక్షంగా చేసుకుని జరిగిన ఐటీ సోదాల్లో దాదాపు రూ. 1, 430 కోట్ల విలువైన అక్రమాస్తులు, రూ. 7 కోట్లు (నగదు), రూ. 5 కోట్ల విలువైన లెక్కలోలేని బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ. దాదాపు రూ. 1, 000 కోట్ల ఆస్తుల్లో అవకతవకలు జరిగాయని ఐటీ శాఖ అధికారులు అంటున్నారు.
శశికళ బినామీ కంపెనీలు
10 బోగస్ సంస్థలకు శశికళ, ఆమె వదిన ఇళవరసి డైరెక్టర్లుగా ఉన్నారని ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తించారు. ఆ సంస్థలకు ఇళవరసి కుమారుడు వివేక్, కుమార్తెలు కృష్ణప్రియ, షకీల, వారి స్నేహితులు బినామీలుగా వ్యవహరిస్తున్నారని అధికారులు గుర్తించారు.
అక్కడ కంపెనీలు, సంస్థలు లేవు
ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాలు పరిశీలించి ఆ కంపెనీలు, సంస్థల చిరునామాలు ఉన్న ప్రాంతాలకు వెళ్లి ఆరా తీశారు. బోగస్ కంపెనీల్లో పేర్కొన్న చిరునామాల్లో ఆయా సంస్థలు కాకుండా నివాస గృహాలు, ఒకే చిరునామా కింద అనేక సంస్థలు ఉన్నాయని ఐటీ శాఖ అధికారుల విచారణలో వెలుగు చూసింది.
సీబీఐ విచారణ
శశికళ, ఆమె కుటుంబ సభ్యులు అక్రమాస్తుల పత్రాలను విదేశాలకు తరలించి ఉంటారని ఐటీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శశికళ కుటుంబ సభ్యుల నివాసాల్లో కోరియర్ రసీదులు భారీ మొత్తంలో చిక్కాయని అంటున్నారు. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి కేసు సీబీఐకి కేసు అప్పగించాలని ఆదాయపన్ను శాఖ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే శశికళ, ఆమె వదిన ఇళవరసి వ్యవహారంపై సీబీఐ అధికారులు రహస్యంగా విచారణ చేస్తున్నారని తెలిసింది.