వాజ్పేయికి ఇష్టమైన వంటకాలు సిద్ధం, దేశమంతా హ్యాపీ: మేనకోడలు
గ్వాలియర్: దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డుని మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్పేయికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాజ్పేయి మేనకోడలు కాంతి మిశ్రా మాట్లాడుతూ.. కుటుంబమంతా హ్యాపీ, దేశం కూడా సంతోషంగా ఉందన్నారు. ప్రపంచం కూడా సంతోషంగా ఉందని భావిస్తున్నానని తెలిపారు.
ఈ అవార్డు పట్ల వాజ్పేయి కుటుంబమంతా గర్వకారణంగా ఉందన్నారు. భారతరత్న తీసుకోవడం ఆలస్యమైనప్పటికీ, సంతోషంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో వాజ్పేయి కుటుంబమంతా ఆనందంలో మునిగిపోయింది. గురువారం రోజు రెండు పండుగలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఒకటి వాజ్పేయి పుట్టిన రోజు(90వ జన్మదినం), మరొకటి భారతరత్న వరించడం. ఈ నేపథ్యంలో వాజ్పేయికి ఇష్టమైన వంటకాలు మంగోడ్, గజార్ కా హల్వా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. ఇక వాజ్పేయి మనవడు అనిమేష్ మాట్లాడుతూ ఈరోజు ఇంత త్వరగా వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదని అన్నాడు.
ఇక అటల్ బీహారీ వాజ్పేయి భారతదేశానికి మూడు సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనారోగ్య కారణంగా కొన్ని సంవత్సరాల నుంచి ప్రజలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
వాజ్పేయికి భారతరత్నను స్వాగతించిన మమత బెనర్జీ
మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్పేయికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వాగతించారు. ఈ సందర్భంలో ఆమె మాట్లాడుతూ వాజ్పేయి అంటే ఇష్టం, గౌరవం ఉన్నాయని అన్నారు. గతంలో వాజ్పేయి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మమతా బెనర్జీ కేబినెట్ మంత్రిగా పనిచేశారు.
సుపరిపాలనకు అర్ధం చెప్పిన వ్యక్తి వాజ్పేయి: జవదేకర్
దేశంలో సుపరిపాలనకు అర్ధం చెప్పిన వ్యక్తి వాజ్పేయి అంటూ కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. కేంద్ర మంత్రివర్గం సమావేశం అనంతరం జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ వాజ్పేయికి భారతరత్న ఇవ్వడం తమకు లభించిన గొప్ప అవకాశమని అన్నారు. దేశంలోని ప్రజలకు వాజ్పేయి అంటే ఎంతో అభిమానం ఉందని ఆయన సేవలను కొనియాడారు.
వాజ్పేయికి భారతరత్న ఇవ్వడం ఆ అవార్డుకే గౌరవం: వెంకయ్య నాయుడు
సుపరిపాలనకు మారుపేరైన మాజీ ప్రధాని వాజ్పేయికి భారతరత్న ఇవ్వడం ఆ అవార్డుకే గౌరవమని వెంకయ్య నాయుడు అన్నారు. మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్పేయి, ప్రముఖ స్వాతంత్య సమరయోధుడు పండిత్ మదన్ మోహన్ మాలవ్యాకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే.