విక్టోరియా రాణి కన్నా నా గేదెలే గొప్ప: అజం రుసరుస
లక్నో: ఉత్తర ప్రదేశ్ మంత్రి, సమాజ్వాది పార్టీ సీనియర్ నేత అజం ఖాన్ గేదెల వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గేదెలు వెతికేందుకు పోలీసులను పంపించడం, ముగ్గురిని సస్పెండ్ చేయడం వంటి అంశాలు అజంకు ఇబ్బందులు తీసుకు వచ్చాయి.
దీనిపై సహనం కోల్పోయిన అజం మాట్లాడుతూ... బ్రిటన్ క్వీన్ విక్టోరియా రాణి కంటే తన గేదెలు గొప్పవని, అవి తన కంటే గొప్పవని వ్యాఖ్యానించారు. నా గేదెలు నాకు అదృష్టంగా భావిస్తానని చెప్పారు. ఏ ఛానల్ చూసినా గేదెలతో పాటు తల పైన పేడ మోస్తున్నట్లు ప్రసారమవుతున్నాయని మండిపడ్డారు.
కాగా, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ వ్యవహరించిన విషయం తెలిసిందే. దొంగతనానికి గురైన మంత్రిగారి ఏడు గేదెలు దొరికాయి. రాంపూర్లోని ఆయన ఫామ్హౌస్ నుంచి గేదెలు కనిపించకుండా పోయాయి. గేదెల కోసం అధికారులతో కూడిన పోలీసు బృందం గాలించింది. పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలించారు. శునకాలను కూడా రప్పించారు. రోజంతా గాలించిన తర్వాత గేదెలు పోలీసుల చేతికి చిక్కాయి.
విధులను నిర్లక్ష్యం చేసినందుకు ముగ్గురు అధికారులపై బదిలీ వేటు పడింది. ఉత్తర్ ప్రదేశ్లోని రాంపూర్లో గల అజమ్ ఖాన్ ఫాం హౌస్లో ఉన్న గేదెలను కొందరు శనివారం నాడు దొంగిలించారు. చుట్టు ఉన్న ఇనుప కంచెను తొలగించి వాటిని తీసుకు వెళ్లారు. పలువురు పోలీసులు దొంగిలించిన వారిని పట్టుకొని, గేదెలను వెనక్కి తీసుకు వచ్చే పనిలో పడ్డారు.
సమీపంలోని మూడు పోలీసు స్టేషన్ల నుండి పోలీసులు వెళ్లి వాటి కోసం గాలించారు. రాంపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సాధనా గోస్వామి ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్కు నేతృత్వం వహిస్తున్నారు. గేదెలను ట్రేస్ చేసేందుకు స్నిఫ్పర్ డాగ్స్ను కూడా ఉపయోగించారు. ఆదివారం సాయంత్రం గేదెలు దొరికాయి.