బీజేపీ-శివసేన కూటమి విజయం, ఒంటరిగా...: సర్వే
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి ఘన విజయం సాధించవచ్చునని సర్వేలో వెల్లడైంది. ఏబీపీ న్యూస్ - ఏసీ నీల్సన్ నిర్వహించిన ఒపీనియన్ పోల్లో 288 అసెంబ్లీ స్థానాల్లో సుమారు 200 సీట్లను కైవసం చేసుకోవచ్చునని అంచనా వేసింది.
దాదాపు పదమూడువేల మంది పైన 72 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ సర్వే చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభావం ఈ ఎన్నికల పైన ఉంటుందని పేర్కొంది. సర్వే వివరాలను శుక్రవారం వెలువరించింది. బీజేపీ సొంతగా 107 సీట్లను పొందవచ్చునని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ బలం 2009లో సాధించిన 82 స్థానాల నుండి 40కి పడిపోవచ్చునని అంచనా వేసింది.
శివసేనతో పొత్తు కుదరని పక్షంలోను బీజేపీ సుమారు 103 స్థానాలను గెలుచుకోవచ్చునని పేర్కొంది. శివసేన 64 స్థానాలను గెలుచుకునే అవకాశముంది. బీజేపీ-శివసేన-ఆర్పీఐ-స్వాభిమాని షెట్కారి సంఘటనతో కూడిన మహా కూటమి ఘన విజయం సాధించనుందని సర్వేలో పాల్గొన్న వారిలో 62 శాతం మంది అభిప్రాయపడ్డారు.