బడ్జెట్ రైల్వే: స్వర్ణ ఛతుర్భుజికి సమాంతరంగా కారిడార్లు
న్యూఢిల్లీ: స్వర్ణ ఛతుర్భుజికి సమాంతరంగా రైల్వే కారిడార్లను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించేందుకు అనుగుణమైన కేటాయింపులు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్లో ఉంటాయని భావిస్తున్నారు.
ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతాలను కలుపుతూ హైస్పీడ్ నెట్వర్క్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ అభిమతం. 2018 రైల్వే బడ్జెట్లో మిగిలిన కారిడార్లకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని ఆశిస్తున్నారు.
గత బడ్జెట్లో ఢిల్లీ - ముంబై, ఢిల్లీ - హౌరా కారిడార్కు రూ.11,189 కోట్లు కేటాయించారు. మిగిలిన ఢిల్లీ - చెన్నై, చెన్నై - హౌరా, చెన్నై - ముంబై, హౌరా - ుంబ కారిడార్లను హైస్పీడ్ నెట్వర్క్ పరిధిలోకి తేవాల్సి ఉంది.
ఈ మార్గాల్లో రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ కారిడార్లను పూర్తి చేయడానికి రూ. 40 వేల కోట్లు అవసరమవుతాయని భావిస్తున్నారు.
75వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 2022 ఆగస్టు 15వ తేదీ నాటికి స్వర్ణ ఛతుర్భుజి మార్గంలో హైస్పీడ్ రైళ్లను నడపాలనేది లక్ష్యం. నాలుగు మెట్రో నగరాలను కలుపుతూ హైస్పీడ్ నెట్వర్క్ అందుబాటులోకి వస్తే ఈ మార్గంలో ప్రయాణించే సమయం సగానికి సగం తగ్గుతుందని అంటున్నారు.