సీబీఎస్ఈ టర్మ్-2 పరీక్షలు షెడ్యూల్ విడుదల: ఏప్రిల్ 26 నుంచి పరీక్షలు, ఆఫ్లైన్ లోనే
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్) 10, 12వ తరగతుల విద్యార్థులకు టర్మ్-2 పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 26 నుంచి థియరీ పరీక్షలు జరుగనున్నాయి. ఆఫ్లైన్ మోడ్లోనే 10, 12వ తరగతుల పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షల నిర్వహణపై బోర్డ్.. రాష్ట్రాలతో చర్చించింది.
ఆ తర్వాతే దేశంలోని కొవిడ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సెకండ్ టర్మ్ పరీక్షలను ఆఫ్లైన్ మోడ్లో మాత్రమే నిర్వహించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ బోర్డు వెబ్సైట్లో శాంపిల్ క్వశ్చన్ పేపర్ను అధికారులు ఉంచారు. కరోనా మహమ్మారి విజృంభణతో ఈ ఏడాది రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. 2022 మార్చి-ఏప్రిల్లో సెకండ్ టర్మ్ పరీక్షలు జరగనున్నాయి.
ఇప్పటికే టర్మ్-1 పరీక్షలు పూర్తయ్యాయి. 10, 12వ తరగతుల విద్యార్థులకు ఏప్రిల్ 26న పరీక్షలు మొదలు కానున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా స్కూళ్లు మూసివేతను దృష్టిలో ఉంచుకొని రెండు పరీక్షల మధ్య గణనీయమైన వ్యవధి ఇచ్చినట్లు చేసిన సర్క్యూలర్లో సీబీఎస్ఈ వెల్లడించింది. జేఈఈ మెయిన్ సహా ఇతర పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని డేట్ షీట్ను తయారు చేసిట్లు తెలిపింది.
పరీక్షల ప్రిపరేషన్ కు చాలా సమయం ఉందని, మరిన్ని వివరాలకు సీబీఎస్ఈ వెబ్సైట్ చూడవచ్చని సూచించింది. కాగా, కరోనా వైరస్ కారణంగా 2021-22 విద్యాసంవత్సరానికి సీబీఎస్ఈ మార్పులు చేసిన విషయం తెలిసిందే. విద్యాసంవత్సరాన్ని రెండుగా విభజించి.. రెండు టర్మ్-ఎండ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా సిలబస్లోనూ మార్పులు చేసింది. రెండు టర్మ్ పరీక్షలు అయిన తర్వాతే తుది ఫలితాలు విడుదల చేస్తారు.