ప్రముఖ రచయిత వేల్చేరు నారాయణరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం...
ప్రముఖ రచయిత వేల్చేరు నారాయణరావును కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. తెలుగు సాహిత్య పరిశోధకుడిగా,అనువాదకుడిగా,విమర్శనా రంగంలో తనదైన ముద్ర వేసిన నారాయణరావు సాహితీ సేవలకు ఈ అవార్డు దక్కింది. ఆయన రాసిన విమర్శనాత్మక గ్రంథం 'తెలుగులో కవితా విప్లవాల స్వరూపం' తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.
పాల్కూరికి సోమనాథుని నుంచి మొదలు ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులో ఉత్తమ సాహిత్యాన్ని ఆయన ఆంగ్లంలోకి అనువదిస్తూ వస్తున్నారు. ప్రపంచస్థాయిలో తెలుగు సాహిత్యానికి గుర్తింపు తీసుకొచ్చేందుకు తనవంతుగా కృషి చేస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర శతకం,బసవ పురాణం,క్రీడాభిరామం,కళా పూర్ణోదయం,కాళిదాసు,విక్రమోర్వశీయం వంటి ప్రసిద్ద తెలుగు రచనలను ఆయన ఆంగ్లంలోకి అనువదించారు. అన్నమయ్య,క్షేత్రయ్య సాహిత్యాన్ని కూడా ఆంగ్లంలోకి అనువదించారు.
ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలలో బీఏ, ఆంధ్రవిశ్వకళా పరిషత్తులో ఎంఏ పూర్తిచేసిన అనంతరం 1970లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి వెల్చేరు నారాయణరావు లింగ్విస్టిక్స్లో డిప్లొమా చేశారు. అనంతరం 1971లో అమెరికాలోని విస్కాన్సిన్ మాడిసన్ విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సౌత్ ఏసియన్ స్టడీస్లో ఉపన్యాసకుడిగా కెరీర్ ప్రారంభించారు. 1975లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా,1981లో అసోసియేట్ ప్రొఫెసర్గా,1987లో ఆచార్యునిగా పదోన్నతి పొందారు. యూనివర్సిటీ నుంచి పదవీ విరమణ అనంతరం ప్రస్తుతం ఏలూరు సమీపంలోని కొప్పాకలో ఆయన నివసిస్తున్నారు. నారాయణరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించడంతో పలువురు సాహితీకారులు,సాహిత్య అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.