అరుణాచల్ప్రదేశ్లో పర్యటనా?: అమెరికాకు చైనా వార్నింగ్
న్యూఢిల్లీ: మరోసారి అగ్రరాజ్యం అమెరికాపై చైనా అక్కసును వెళ్లగక్కింది. భారత్లో అమెరికా రాయబారి రిచర్డ్వర్మ గతవారం అరుణాచల్ప్రదేశ్ను సందర్శించడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. భారత్-చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యలో తలదూర్చి వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడవద్దని సూచించింది.
గతవారం అరుణాచల్ప్రదేశ్లో జరిగిన వేడుకల్లో భాగంగా రిచర్డ్వర్మ తవాంగ్లో పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పెమాఖండూ, అస్సాం సీఎం సర్బానంద్ సోనోవాల్లతో కలిసి దిగిన ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. దీనిపై చైనా మండిపడింది. అంతేగాక, అరుణాచల్ప్రదేశ్ను దక్షిణ టిబెట్గా పేర్కొంటూ ఆ సరిహద్దులో సుమారు 4వేల కిలోమీటర్ల మేర ఉన్న సరిహద్దు ప్రాంతమంతా వివాదాస్పదమైందని చైనా పేర్కొంది. దీన్ని రిచర్డ్వర్మ సందర్శించడాన్ని తప్పుపట్టింది.
'వివాదాస్పద సరిహద్దు ప్రాంతాన్ని రిచర్డ్వర్మ సందర్శించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం' అని సోమవారం జరిగిన మీడియా సమావేశంలో చైనా విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి లూ కంగ్ అన్నారు. తూర్పు ప్రాంతం సరిహద్దు విషయంలో చైనా స్పష్టతతో ఉందని, అయితే ఇరు దేశాల మధ్య నెలకొని ఉన్న ప్రాదేశిక వివాదం విషయంలో సంప్రదింపులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
వర్మ ఈశాన్య రాష్ట్ర సందర్శనను బాధ్యతారాహిత్యంగా లు కంగ్ అభివర్ణించారు. భారత్-చైనాల మధ్య నడుస్తున్న సంప్రదింపుల పరంపరకు విఘాతం కలిగించడంలాంటిదని అన్నారు. మూడో వ్యక్తి ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
'అమెరికా ప్రవర్తన భారత్-చైనాల మధ్య నెలకొని ఉన్న సుహృద్భావ వాతావరణాన్ని నష్ట పరిచేదిగా ఉంది. ఈ చర్యతో సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. అమెరికా చర్య ఇరుదేశాల సరిహద్దులో నెలకొని ఉన్న శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించేలా ఉంది. అమెరికాకు మేము విన్నవించేది ఒక్కటే.. దయచేసి భారత్-చైనా సరిహద్దు విషయంలో తలదూర్చవద్దు' అని లు కంగ్ పేర్కొన్నారు.