ఆ ఇద్దరు మతగురువులు భారత్ కు వ్యతిరేకం: స్వామి సంచలన వ్యాఖ్యలు
పాకిస్తాన్ లో అదృశ్యమై.. భారతదేశానికి చేరుకున్న ఇద్దరు ముస్లిం మతపెద్దలపై బీజేపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి మరో తాజా వివాదం లేవనెత్తారు. పాకిస్తాన్ లో కనిపించకుండా పోయి.. సురక్షితంగా భారతదేశంలోకి చేరుకున్న ఇద్దరు ముస్లిం మతపెద్దలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ ఇద్దరు ముస్లిం మత పెద్దలు అబద్ధం చెబుతున్నారని, వారు భారత్ కు వ్యతిరేకంగా పని చేస్తున్నారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. సోమవారం పార్లమెంట్ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు.
వారిని వారు రక్షించుకునేందుకు, సానుభూతి పొందేందుకు అబద్ధం చెబుతున్నారని, తమను తాను రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) ఏజెంట్లుగా వర్ణించుకుంటున్నారని, వారిని నమ్మలేమని, వారు భారత దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు తమ వద్ద పక్కా సమాచారం ఉందని అన్నారు.

పాకిస్తాన్ లోని కరాచీలో అదృశ్యమైన ఇద్దరు మతగురువులు హజ్రత్ నిజాముద్దీన్, సయ్యద్ ఆసిఫ్ నిజామీ సోమవారం సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసందే. వారు ఈనెల 8న అదృశ్యం కావడంతో గందరగోళం నెలకొంది.
అయితే పాకిస్తాన్ లోని ఉమ్మత్ దినపత్రిక తమ గురించి తప్పుడు కథనాలు రాసిందని, తాము భారత విదేశాంగ నిఘా సంస్థ రా గూఢచారులమని పేర్కొంటూ ఫొటోలు ప్రచురించిందని, అందువల్లే ఇంత గందరగోళం చోటు చేసుకుందని ఆ ఇద్దరు మత పెద్దలలో ఒకరైన నజీమ్ నిజామీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications