మోడీపై ఫిర్యాదు: ఢిల్లీ పోలీస్ నెక్ట్స్ స్టెప్ ఏంటీ?
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రతిష్టను దెబ్బతీసేలా మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్లో ట్వీట్స్ చేసిన ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీపై రాష్ట్రపతి భవన్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రణబ్ ముఖర్జీ, ఆయన కార్యదర్శి ఒమితా పౌల్ తరఫున అధికారులు ఢిల్లీ పోలీసు కమీషనర్ బీఎస్ బస్సీకి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.
లలిత్ మోడీ ఇటీవల ట్విట్టర్లో ప్రణబ్ ముఖర్జీ, ఆయన కార్యదర్శి ఒమితా పౌల్పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. లలిత్ మోడీ జూన్ 23న ట్విట్టర్పై చేసిన విమర్శలకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఫిర్యాదు పత్రంతో పొందుపరిచారు. లలిత్ మోడీ ట్వీట్లో ప్రణబ్ ముఖర్జీ, అమితాపౌల్, ప్రముఖ వ్యాపారవేత్త వివేక్ నాగ్పాల్ ఫోటో పెట్టి ముఖర్జీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వివేక్ నాగ్పాల్ ఆయన నుంచి లబ్ధి పొందారని ఆరోపించారు.
గతంలో కోచ్చి ఐపిఎల్ ప్రాంచైజీలో వాటాల పెట్టుబడుల గురించి ప్రశ్నించినందుకు ప్రణబ్ ముఖర్జీ తనపైకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి)ని విచారణకు ఆదేశించారని మరో ఆరోపణ చేశారు. ఐపీఎల్లో కొచ్చి వాటాల గురించి తాను ప్రశ్నలు అడిగినందుకే శశిథరూర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చిందని ట్వీట్లో పేర్కొన్నారు.
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీపై రాష్ట్రపతి భవన్ చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు సాధ్యమవుతుందా లేదా అనేది ఢిల్లీ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చా లేదా అనే అంశంపై ఢిల్లీ పోలీసులు న్యాయ శాఖ సలహా తీసుకుంటున్నారు.
కేంద్ర న్యాయ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తక్షణమే రాష్టప్రతి భవన్ ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించి ప్రస్తుతం లండన్లో తలదాచుకుంటున్న లలిత్ మోడీకి నోటీసులు పంపిస్తారు. రాష్టప్రతి భవన్ ఫిర్యాదును ఐపీసీ 499 లేదా 500 సెక్షన్ల కింద నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.
రాష్టప్రతిని అప్రతిష్ట పాలు చేసేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను లలిత్ మోడీకి రెండు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీనితోపాటు ఆయన ట్విట్టర్ ఖాతాను నిలుపుదల చేసేందుకు కూడా అవకాశాలున్నాయి.