కేంద్రం కీలక నిర్ణయం: మార్చి 31తో కరోనా నిబంధనలు పూర్తిగా ఎత్తివేత, రాష్ట్రాలకు సూచనలు
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కోవిడ్-19 పూర్తిగా అదుపులోకి వస్తున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కోవిడ్-19 నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించింది.
మాస్కులు, భౌతిక దూరం, రాష్ట్రాలకు కేంద్రం సూచనలు
అయితే మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు కొనసాగుతాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ప్రజలంతా చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచనలు చేసింది. కరోనావైరస్ నియంత్రణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. రాష్ట్రాలలో కేసులు పెరిగితే.. స్థానిక ప్రభుత్వాలు నిబంధనలు విధించుకోవచ్చని కేంద్ర హోం శాఖ సూచించింది.
దేశంలో కరోనా నిబంధనలు పూర్తిగా ఎత్తివేత
దేశంలో కరోనా వైరస్ విజృంభించడంతో దాదాపు రెండేళ్ల క్రితం వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ఈ నిబంధనలను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. కోవిడ్ కట్టడి కోసం 2020 మార్చి 24న విపత్తు నిర్వహణ చట్టం కింద తొలిసారిగా ఈ నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. ఆ తర్వాత కేసుల సంఖ్యను బట్టి పలుమార్లు వీటిలో మార్పులు, చేర్పులు చేసింది. అయితే, గత ఏడు వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే నిబంధనలను పూర్తిగా తొలగించాలని హోంమంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
నిబంధనలు విధించుకోవచ్చు.. కేంద్రం కీలక సూచనలు
కరోనా పరిస్థితుల్లో మెరుగుదలతోపాటు కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా తమ సామర్థ్యాన్ని పెంచుకొని సొంత వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రస్తుతం దేశంలో కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
అన్ని నిబంధనలు ఇకపై పొడగించాల్సిన అసవరం లేదని భావిస్తున్నాం. మార్చి 31న ప్రస్తుతమున్న ఆంక్షల గడువు ముగియనుంది. ఆ తర్వాత హోంశాఖ ఎలాంటి కొత్త ఆదేశాలు జారీ చేయదు అంటూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు పంపిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వైరస్ వ్యాప్తి ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయలేం కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.