యువతి లవ్ మ్యారేజ్, తల్లిదండ్రుల మీద కేసు పెట్టింది, ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య !
పెద్దలను ఎదరించిన యువతి ప్రియుడిని వివాహం చేసుకుని ఆమె తల్లిదండ్రుల మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. కన్న కుమార్తె తమ మీద పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో అవమానంతో తల్లిదండ్రులతో సహ నలుగురు ఆత్మహత్య చేసుకు
సేలం: పెద్దలను ఎదరించిన యువతి ప్రియుడిని వివాహం చేసుకుని ఆమె తల్లిదండ్రుల మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. కన్న కుమార్తె తమ మీద పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో అవమానంతో తల్లిదండ్రులతో సహ నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.
తమిళనాడులోని సేలం జిల్లా తాండానూరులో రాజేంద్రన్ (45), రాణి (40) దంపతులు నివాసం ఉంటున్నారు. రాజేంద్రన్ రాణి దంపతులకు ఉషా ( 23), ఆర్తీ (20), నవీన్ (17) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఉషా బీఏ పూర్తి చేసింది. ఆర్తీ బీఏ ద్వితీయ సంవత్సరం, నవీన్ ఇంటర్ చదువుతున్నారు.
రాజేంద్రన్ వ్యవసాయం చేస్తున్నాడు. ఉషా ఆటో డ్రైవర్ మణింకఠన్ అనే యువకుడిని ప్రేమించింది. మణికంఠన్ 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు. ఉషా, మణికంఠన్ ది ఒకే కులం. అయితే చదువులేని మణికంఠన్ తో ఉషా వివాహం చెయ్యడానికి రాజేంద్రన్ నిరాకరించాడు. ఉషా, మణికంఠన్ ఈనెల 3వ తేది ఇంటి నుంచి పారిపోయి రిజస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
తన కుమార్తె ఉషా కనిపించలేదని రాజేంద్రన్ ఫిర్యాదు చెయ్యడంతో తాండానూరు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. తరువాత ఉషా తాను మణికంఠన్ ను పెళ్లి చేసుకున్నానని, మా మీద కుటుంబ సభ్యులు దాడి చేసే అవకాశం ఉందని, రక్షణ కల్పించాలని తాండానూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కన్న కుమార్తె తమ మీద పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో రాజేంద్రన్, రాణి దంపతులు జీర్ణించుకోలేకపోయారు. అవమానంతో రాజేంద్రన్, రాణి దంపతులు, వారి పిల్లలు ఆర్తీ, నవీన్ పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారు.
విషయం తెలుసుకున్న ఉషా కుటుంబ సభ్యులకు చివరిచూపు చూసుకోవడానికి ప్రయత్నించింది. అయితే రాజేంద్రన్ బంధువులు ఉషా మీద దాడి చేసే అవకాశం ఉందని గుర్తించిన పోలీసులు ఆమెను అంత్యక్రియలకు అనుమతించలేదు. అవమానంత ఒకే కుటుంబంలో అందరూ ఆత్మహత్య చేసుకోవడంతో తాండానూరులో విషాదచాయలు నెలకొన్నాయి.