ఉబేర్ సారీ: పిన్నీ అంటూ డ్రైవర్ దారుణం, తుపాకీతో బెదిరించి రేప్
న్యూఢిల్లీ: యువతి పైన అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ కారు డ్రైవర్ శివకుమార్ యాదవ్కు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేటు న్యాయస్థానం 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ఓ ఉద్యోగిని పైన అత్యాచారం చేసిన కేసులో మూడు రోజుల రిమాండు అనంతరం శివకుమార్ను గురువారం కోర్టులో ప్రవేశ పెట్టారు.
విచారణ పూర్తయిందని, నిందితుడిని కారాగారానికి పంపించవచ్చునని పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు. దీంతోడిసెంబర్ 24వ తేదీ వరకు జ్యూడిషియల్ కస్టడీకి న్యాయస్థానం ఆదేశించింది. న్యాయమూర్తి ఆదేశాల మేరకు అతనిని తీహార్ జైలుకు తరలించారు.
దర్యాఫ్తు అధికారిపై కోర్టు ఆగ్రహం
ఉబేర్ క్యాబ్ డ్రైవర్ అత్యాచార కేసుకు సంబంధించి దర్యాఫ్తు అధికారి పైన గురువారం ఢిల్లీ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితునికి ఉన్న లైసెన్స్ నకిలీదా, కాదా అన్న విషయంతో సహా పలు అంశాల పైన సరైన సమాధానం చెప్పడం లేదని మెట్రోపాలిటన్ న్యాయమూర్తి రవీంద్ర కుమార్ పాండే దర్యాఫ్తు అధికారిణి రేణూను ప్రశ్నించారు. ఈ కేసులో దర్యాఫ్తు అధికారి మీరేనా అని ఆగ్రహించారు.
ఉబేర్ క్యాబ్ క్షమాపణ
ఉబేర్ సంస్థకు చెందిన కారు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన పైన ఆ సంస్థ క్షమాపణలు చెప్పింది. కేసుకు సంబంధించి అధికారులకు సహకరిస్తామని చెప్పింది. నగరంలో తిరిగి తమ సేవలను పునరుద్ధరిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది.
నేరాల పుట్ట..
ట్యాక్సీ డ్రైవర్ శివకుమార్ యాదవ్ విషయమై ఆయన గ్రామంలో విచారించారు. అతను మామూలు మనిషి కాదని నేరాల పుట్ట అని చెబుతున్నారు. పలు అత్యాచారాలు చేసినట్లు అతనే స్వయంగా పోలీసుల విచారణలో వెల్లడించాడు. అతని సొంత ఊర్లో మీడియా విచారించింది. పలువురు మహిళలు ముందుకొచ్చి తమ పైన జరిగిన దాడులను వివరించారు.
వారిలో ఒకరు సమీప బంధువు. పిన్నీ అని పిలిచి అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆమె వాపోయింది. డిగ్రీ చదివి యువతి అతని బారినపడ్డ నేరానికి చదువు మానేసి పెళ్లి చేసుకొని వెళ్లిపోవాల్సి వచ్చింది. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో మహిళ కనబడితే గొంతు నొక్కి, తుపాకీ పెట్టి బెదిరించి అత్యాచారం చేసేవాడని తెలిపారు.
ఒంటరిగా కాపుకాసి, నోరెత్తనీయకుండా పీకనొక్కేవాడని, తుపాకీ చూపి బెదిరించేవాడని, ఒంటిమీద నగలు కూడా దోచుకున్నాడని పలువురు మహిళలు వాపోయారు. ఒకరిద్దరు మాత్రమే కుటుంబ సభ్యుల అండతో ఫిర్యాదు చేశారు. మిగిలిన వాళ్ల అందరు పరువు కోసం నోర్మూసుకొని బతకవలసి వచ్చిందని వాపోయారు.
కొడుకు మూలంగా పరువు పోయిందని...
కొడుకు మూలంగా గ్రామంలో తమ పరువు పోయిందని, పలుసార్లు ఇంటి నుండి వెళ్లిపొమ్మని చెప్పామని అతని తల్లిదండ్రులే చెప్పారు. తప్పు చేసిన వాడిని శిక్షించాలని, తమను కాదని అతని తల్లి ఆవేశంగా చెప్పారు. 2003 నుండి శివకుమార్ మీద పలు కేసులు నమోదయ్యాయి. అత్యాచారం, గూండాగిరి, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం లాంటి కేసుల్లో అరెస్టు కావడం బెయిల్ పైన విడుదల కావడం నిత్యకృత్యంగా మారిందంటున్నారు.