మాల్యాకు ఎదురుదెబ్బ: పాస్ పోర్ట్ను రద్దు చేసిన కేంద్రం
ముంబై: బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుని ఎగ్గొట్టిన కేసులో విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మాజీ అధినేత విజయ్ మాల్యాకు ఎదురు దెబ్బ తగిలింది. విజయ్ మాల్యా పాస్ పోర్ట్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. మనీ లాండరింగ్ కేసులో మూడు సార్లు ఈడీ విచారణకు విజయ్ మాల్యా గైర్వాజరైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మాల్యా పాస్ పోర్ట్ రద్దు చేసి, లుకౌట్ నోటీసులు జారీ చేయడం ద్వారా ఆయన ఇండియాకు తీసుకురావచ్చని, ఆ తర్వాత ముక్కుపిండి బకాయిలు వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈడీ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయన పాస్ పోర్టును రద్దు చేసినట్టు ప్రకటించింది.
వివరాల్లోకి వెళితే.... పాస్పోర్ట్ యాక్ట్, 1967 కింద మాల్యాపై ఈ మేరకు చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖకు ఈడీ లేఖ రాసింది. ముంబైలోని జోనల్ కార్యాయంలో పీఎంఎల్ఐ (అక్రమ ధనార్జనా చట్టం) కింద జరుగుతున్న క్రిమినల్ కేసుల విచారణలో ఏ మాత్రం సహకరించడంలేదని పేర్కొంటూ... మాల్యా డిప్లమాటిక్ పాస్పోర్ట్ను రద్దు చేయాలని ఇక్కడి ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాన్నీ ఈడీ కోరింది.
రూ.900 కోట్ల ఐడీబీఐ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్న మాల్యా ఉద్దేశ పూర్వకంగా రుణాన్ని ఎగ్గొట్టిన కేసుని ఈడీ విచారణ చేస్తోంది. రాజ్యసభ సభ్యునిగా జారీ చేసిన డిప్లమేటిక్ పాస్పోర్ట్ను వినియోగించుకుని ఆయన మార్చి 2న లండన్ పారిపోయిన సంగతి తెలిసిందే.
పాస్పోర్ట్ చట్టం ప్రకారం... డిప్లమాటిక్ పాస్పోర్ట్ జారీ సందర్భంలో సంబంధిత వ్యక్తి రెగ్యులర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ డాక్యుమెంట్లను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డిప్లమేటిక్ పాస్పోర్ట్ రద్దయితే... రెగ్యులర్ పాస్పోర్ట్ రద్దుకూ అది దారితీస్తుంది. తాజా పాస్ పోర్ట్ రద్దు నేపథ్యంలో మాల్యా మరింత ఇబ్బందుల్లో కూరుకుపోయారు.
ఈడీ విజ్ఞప్తి మేరకు కేంద్రం మాల్యా పాస్ పోర్ట్ను రద్దు చేసిన విషయాన్ని విదేశాంగ మంత్రిత్వశాఖ బ్రిటన్ అధికారులకు తెలియజేస్తుంది. అలాగే మాల్యాను దేశానికి పంపాలని కోరుతుంది. ఐడీబీఐ రూ.900 కోట్ల లోన్ డిఫాల్ట్ కేసులో విచారణకు రావాలని మూడుసార్లు (మార్చి 18, ఏప్రిల్ 2, ఏప్రిల్ 9) ఈడీ ముంబై విభాగం ఆదేశాలు ఇచ్చింది.
అయితే ఈ మూడు సార్లూ మాల్యా విచారణకు హాజరు కాలేదు. రుణ పరిష్కార అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున, తాను ఇప్పుడే వీటిపై ఏమీ చేయలేనని మాల్యా నుంచి సమాధానం అందినట్లు ఈడీ పేర్కొంది. సుప్రీం కోర్టు విచారణలో భాగంగా భారత్లోని తన లీగల్ టీమ్ సహకారంతో కేసు దర్యాప్తు జరపాలని మాల్యా కోరుతున్నాడని, అయితే కేసు విచారణకు ఆయన తప్పనిసరిగా హాజరుకాలని ఈడీ పట్టుబడుతోంది.
మాల్యా విచారణకు హాజరైతే నిజానిజాలు వెల్లడవుతాయని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో భాగంగా మాల్యా పాస్ పోర్ట్ రద్దు చేయాలని కేంద్రాన్ని ఈడీ విజ్ఞప్తి చేసింది. ఆ తర్వాత ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీని కోరుతూ ఈడీ తగిన న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంటుంది.
దీంతో ప్రపంచంలో మాల్యా ఎక్కడున్నా... పట్టుకోడానికి రెడ్ కార్నర్ నోటీసునూ జారీ చేసే వెసులుబాటు ఏర్పడుతుంది. ప్రస్తుతం విజయ్ మాల్యా లండన్లో ఉన్నారు. మాల్యాకు విదేశాల్లో ఉన్న ఆస్తుల సమాచారాన్ని సేకరించే క్రమంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, తదితర దేశాలకు లెటర్స్ రొగటొరీస్(ఎల్ఆర్)ల జారీకి ఈడీ సిద్ధమవుతుంది.