నాందేడ్ - బెంగళూర్ రైల్లో మంటలు: 26 మంది మృతి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశఅ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కొత్తచెరువు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారు జామున నాందేడ్ - బెంగళూర్ ఎక్స్ప్రెస్ రైలు ఎసి బోగీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 26 మంది మరణించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
ప్రమాదంలో డి - 1 ఎసి బోగీ పూర్తిగా కాలిపోగా, మరో బోగీ పాక్షికంగా దెబ్బ తిన్నది. ప్రమాదంలో గాయపడిన 15 మంది ప్రయాణికులను పెనుగొండ ధర్మవరం ఆస్పత్రికి తరలించారు. టీసీ వద్ద ఉన్న ప్రయాణికుల జాబితా దగ్ధం కావడంతో మృతుల వివరాలు తెలియడం లేదు. ప్రమాదానికి గురైన డి1 ఎసి బోగీలో 57 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు.
ఘటనా స్థలానికి కలెక్టర్ లోకేష్ కుమార్ చెరుకుని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రైల్వై ఉన్నతాధికారుల బృందం కూడా ప్రమాద స్థలానికి చేరుకుంది. షార్ట్ సర్క్యూట్ అగ్నిప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. చెన్నైకి చెందిన తనుశ్రీ, నిఖిత, నటేష్ తీవ్రంగా గాయపడినవారిలో ఉన్నారు. వారిని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల్లో రాష్ట్రంలోని ఆదోనీకి చెందిన బసవరాజు, సర్వమంగళం, హైదరాబాద్కు చెందిన గణేష్ ఉన్నట్లు సమాచారం. ధర్మవరం ఆస్పత్రిలో తనూజ (బెంగళూర్), గల్వీన్ కౌర్ (బెంగళూర్), నటేష్ (చెన్నై, విజయ రామ్మూర్తి (మైసూరు), తనుశ్రీ (చెన్నై), నరేష్, అనిల్ చికిత్స్ పొందుతున్నారు.