జైలు నుంచి గాలి జనార్ధన్ విడుదల: చిదంబరం కుమారుడికి నోటీసులు
బెంగళూరు/చెన్నై: ఓఎంసి కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్ధన్ రెడ్డి బెంగళూరు పరప్పన అగ్రహారం జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యారు. సుమారు నాలుగేళ్లపాటు జైలు జీవితం అనుభవించిన గాలి జనార్ధన్ రెడ్డి శుక్రవారం జైలు నుంచి బయటకు వచ్చారు.
కాగా, గాలి విడుదల కోసం జైలు ముందు వేచివున్న అతని మద్దతుదారులు సంబరాలు జరుపుకున్నారు. జనవరి 20న సుప్రీం కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అక్రమ మైనింగ్ ఆరోపణలపై 2011, సెప్టెంబర్ 5న సిబిఐ అధికారులు ఆయనను బళ్లారిలోని ఆయన ఇంట్లోనే అరెస్ట్ చేశారు.
శ్రీనివాస్ రెడ్డికి బెయిల్ మంజూరు
ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్థన్రెడ్డి బంధువైన శ్రీనివాస్రెడ్డికి బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరుకు సంబంధించిన పూచీకత్తులను సీబీఐ కోర్టుకు సమర్పించాలని ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
చిదంబరం కుమారుడికి షోకాజ్ నోటీసులు
చెన్నై: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ సీనియర్ నేత,దివంగత కామరాజ్కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ఈ మేరకు నోటీసులను జారీ చేసింది. కామరాజ్పై చేసిన వ్యాఖ్యలపై వారంరోజుల్లోగా వివరణ ఇవ్వాలని కార్తీ చిదంబరాన్ని ఆదేశించింది.