దేవుడే రక్షిస్తాడు, నాకు సెక్యూరిటీ వద్దు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ తనకు వ్యక్తిగత భద్రతను నిరాకరించారు. తనకు ఏ విధమైన భద్రత అవసరం లేదని, ఎస్కార్టు కూడా వద్దని, దేవుడే తన పెద్ద రక్షకుడని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఓ లేఖ రాశారు.
44 ఏళ్ల మాజీ ఆదాయం పన్నుల శాఖ అధికారి కేజ్రీవాల్ ఢిల్లీలో మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహించనున్నాడు. ఆయన ఈ నెల 26వ తేదీ రామ్ లీలా మైదానంలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టడానికి సిద్ధపడ్డారు. కాంగ్రెసు ఆయనకు బయటి నుంచి మద్దతు ఇస్తోంది.
తమ మంత్రులు భారీ ప్రభుత్వ భవనాలకు, ఎర్ర బుగ్గల కార్లకు దూరంగా ఉంటారని ఆయన చెప్పారు. బిజెపి అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నిరాకరించింది. ఢిల్లీలో నిర్వహించిన సర్వేలో 74 శాతం మంది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెసు పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అర్వింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం ద్వారా ఢిల్లీ ప్రజలను మోసం చేస్తున్నారని బిజెపి నేత హర్షవర్ధన్ సోమవారంనాడు విమర్శించారు. కాంగ్రెసు మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడాన్ని బట్టి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అధికార దాహంతో ఎలా వేగిపోతున్నారో అర్థమవుతుందని ఆయన అన్నారు