జీఎస్టీ శుభవార్త, వచ్చే భేటీలో పెట్రోల్ తగ్గుదలపై: 29 వస్తువులపై పన్నులేదు, 53 సేవలపై సవరణ
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి గురువారం భేటీ అయింది. ఈ భేటీలో శుభవార్త తెలిపింది. 29 వస్తువులు, 53 వర్గాల సేవలపై పన్ను రేట్లను సవరించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జీఎస్టీ మండలి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. కొన్ని వస్తువులు, సేవలపై పన్ను రేట్లను సవరించినట్లు చెప్పారు.
29 వస్తువులు, 53 వర్గాల సేవలను తక్కువ పన్ను రేట్ల విభాగంలోకి మార్చినట్లు చెప్పారు. కొత్త రేట్లు ఈ నెల 25వ తేదీ నుంచి అమలులోకి రానున్నట్లు చెప్పారు. జీఎస్టీ ఫైలింగ్ విధానాన్ని సరళీకృతం చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదన్నారు. చర్చ జరిగినట్లు చెప్పారు.
ప్రజంటేషన్ ఇచ్చారు
నందన్ నీలేకని దీనికి సంబంధించి మంచి ప్రజంటేషన్ ఇచ్చారని జైట్లీ చెప్పారు. దీనిపై చర్చ జరిగిందన్నారు. పది రోజుల తర్వాత వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మరోసారి సమావేశం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో రిటర్నుల ఫైలింగ్ పైన చర్చించి, నిర్ణయం తీసుకుంటామన్నారు.
పెట్రోల్, డీజిల్పై చర్చ జరగలేదు
జీఎస్టీ వసూళ్లు రూ.35 వేల కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేయాలని కౌన్సెల్ సమావేశం నిర్ణయించిందని జైట్లీ చెప్పారు. జీఎస్టీ పరిధిలో పెట్రోల్, డీజిల్ వంటి వాటిని తీసుకు రావడంపై ఈ సమావేశంలో చర్చ జరగలేదని చెప్పారు. తర్వాత సమావేశంలో వీటిని కూడా జీఎస్టీలోకి తెచ్చే అంశంపై చర్చిస్తామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఈ-వే బిల్లును అమల్లోకి తెస్తున్నట్లు తెలిపారు. 29 హ్యాండీక్రాఫ్ట్ వస్తువులపై పన్ను తొలగించినట్లు చెప్పారు.
కీలకంగా మారిన సమావేశం
కాగా, గత రెండు నెలల్లో జీఎస్టీ వసూళ్లు తగ్గిపోయిన నేపథ్యంలో నేటి సమావేశం కీలకంగా మారింది. జీఎస్టీ రిటర్నుల ప్రక్రియను సులభతరం చేసే అంశంపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని భావించినప్పటికీ అది జరగలేదు.
కీలక సంస్కరణ జీఎస్టీ
దేశ ఆర్థిక వ్యవస్థ చరిత్రలోనే కీలక సంస్కరణగా పేర్కొన్న జీఎస్టీ గతేడాది జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం వస్తువులు, సేవలపై 5, 12, 18, 28 శ్లాబులుగా పన్నులు విధిస్తున్నారు. గత సమావేశాల్లో 28 శాతం శ్లాబులో ఉన్న చాలా వస్తువులను కింది శ్లాబులకు తగ్గించారు.