రాహుల్ ఉత్తేజం.. మోదీ ప్రతిష్ఠకు సవాలే
గాంధీనగర్/ అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్ గురువారం జరుగనున్నది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం కావడం ఈ ఎన్నికలు ఆయనకు ప్రతిష్ఠాత్మకం కానున్నాయి. గుజరాతీలపై ఆయన ప్రచారం ప్రభావం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీలో నూతనోత్తేజం, పటేల్ సామాజిక వర్గంలో పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) నాయకుడు హార్దిక్ పటేల్ పలుకుబడికి ఈ ఎన్నికల ఫలితాలు గీటురాయి కానున్నాయి. ఇటు అధికార బీజేపీ, అటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా ప్రచారం చేశాయి.
గురువారం సాయంత్రానికి గుజరాతీలు తమ నిర్ణయాన్ని ఈవీఎంల్లో నిక్షిప్తం చేస్తారు. వచ్చే సోమవారం ఉదయం 11 గంటలకల్లా వీటి ఫలితాలు యావత్ దేశానికి తెలిసిపోతాయి. అంతే కాదు.. దేశ భవితవ్యం ఎటుదిశగా ముందుకెళ్లనున్నదో కూడా నిర్దేశిస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఇలా గుజరాతీలతో మమేకమైన ప్రధాని మోదీ
అయితే 2002 నుంచి 2012 వరకు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఆ రాష్ట్ర సీఎంగా పని చేసిన ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ.. ప్రత్యేకించి గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం స్ఫూర్తితో బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా దేశ ప్రజల ముందుకు వచ్చారు. నాడు అధికారంలో ఉన్న యూపీఏలోని మంత్రుల అవినీతి, ప్రాంతీయ పార్టీల్లో అంతర్గత కుమ్ములాటల ఆసరాగా.. ‘అచ్చేదిన్', నల్లధనం వెలికితీస్తానని జనాంతికంగా ప్రచారం చేయడంతో భారతీయుల్లో అత్యధికులు విశ్వసించి ఆయన ఇంద్రజాల మహిమకు ఓటేశారు. మామూలుగా కాదు.. 1984 తర్వాత సొంతంగా పార్టీ ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీని ఇచ్చారు దేశ ప్రజ. కానీ అదంతా తన గొప్పతనమేనన్న అభిప్రాయం బీజేపీ ప్రధాన నాయకత్వంలో ఏర్పడిందన్నవిమర్శలు ఉన్నాయి. కానీ ఈనాడు ప్రధాని మోదీ గుజరాత్ రాష్ట్రంలో సీఎం పదవి కోసం పోరాడటం లేదు. ఆయన వ్యక్తిగత చరిష్మాకు ఈ ఎన్నికలు నిలువుటద్ధం కానున్నాయి. ఆయన అంతగా గుజరాతీలతో మమేకమై పోయారు మరి.
రాహుల్ విమర్శలతో ఇలా ఆత్మరక్షణలో బీజేపీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీలో నూతనోత్తేజం.. గుజరాత్ ఎన్నికల ప్రచారం తీరుతెన్నులనే మార్చివేసిందంటే అతిశయోక్తి కాదు. 2004లో రాజకీయ రంగ ఆరంగ్రేటం చేసిన యువకుడిగా ముత్తాత, నానమ్మ.. అటుపై తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని జనంతో మమేకం కావడానికి చాలా కష్ట పడ్డారు రాహుల్ గాంధీ. గత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీ నేతలు ఆయన్ను పదేపదే ‘పప్పు' అని వెటకారం చేసేందుకు కూడా వెనుకాడలేదు. కానీ క్రమంగా పరిణతి చెందిన అసలు సిసలైన రాజకీయ నాయకుడిగా ఆయనలో నూతన ఇంద్రజాలం వెలుగులోకి వచ్చింది. ఆశ్చర్యకరమైన రీతిలో అధికార బీజేపీపై రాహుల్ విమర్శలు కాంగ్రెస్ పార్టీకి నూతన శక్తిని తీసుకొచ్చాయి. అందునా ఆయన ప్రచారం ప్రత్యర్థుల పట్ల ఏమాత్రం దురుసుగా లేదు. ప్రత్యర్థులపై చాలా సాఫ్ట్గా ప్రశ్నలు సంధిస్తూ హాయిగా సాగే ప్రసంగం వినేవారికి దగ్గర చేసింది. ఆయనలో వచ్చిన నూతనోత్తేజం ఓటర్లను కూడగట్టేస్థాయికి తీసుకు రాగల సామర్థ్యం కలిగి ఉంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి పోటీ ఇవ్వగలమన్న సందేశం ప్రత్యర్థులకు సూటిగా ఇచ్చారు రాహుల్ గాంధీ.
పాస్తో అవగాహన కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం
గుజరాతీలకు నిలయమైన పాటిదార్లకు సమర్థవంతమైన నేతగా ముందుకు వచ్చిన పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) కన్వీనర్ హార్దిక్ పటేల్ ప్రజా నాయకుడిగా ముందుకు వచ్చారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పాత్ర కాదనే పరిస్థితి స్రుష్టించగలిగారు హార్దిక్ పటేల్. ఓబీసీ కోటాలో రిజర్వేషన్ల కోసం హార్దిక్ పటేల్ చేపట్టిన ఆందోళనతో మరోసారి బీజేపీ తేలిగ్గా విజయం సాధించే పరిస్థితి లేదు. ‘పాస్' కన్వీనర్ హార్దిక్ పటేల్తో అవగాహన.. గుజరాత్ రాష్ట్రంలో అచేతనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సాధించేందుకు మార్గం ఏర్పడింది. పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ మాదిరిగా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే మాదిరిగా నిర్దేశిత లక్ష్యం కోసం అవిశ్రాంతంగా పోరాడే సామర్థ్యం హార్దిక్ పటేల్ సొంతం. ఆయన పోరాట పటిమలో భవిష్యత్ నాయకుడు ఉన్నాడంటే అతిశయోక్తి కాదు.
గుజరాత్ ప్రగతిపై ఇలా రాహుల్ వాదనకు మద్దతు
ఆ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ‘గుజరాత్ మోడల్ ప్రగతి' పేరిట జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రచారం హోరెత్తింది. ఆ స్థాయిలో కమలనాథులు ప్రచారం కల్పించారు మరి. కానీ ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో ‘గుజరాత్ డెవలప్మెంట్' తొలిసారి చర్చనీయాంశం అయ్యింది. ఈ మోడల్ అమలులో లోపాలు బయట పడ్డాయి. మౌలిక వసతుల కల్పన వరకు బాగానే ఉన్నా సేవా రంగం, సామాజిక సూచీల పరిస్థితి ఫేలవంగా ఉంది. ఆరోగ్య రంగం, విద్యాబోధనలో ఔట్ సోర్సింగ్, ప్రైవేటీకరణ అంశాలు ప్రస్తావనార్హంగా మారాయి. దీంతో గుజరాత్ మోడల్ డెవలప్మెంట్ హాస్యాస్పదంగా మారింది. అభివ్రుద్ధి ఒక పిచ్చిగా మారిపోయిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీ వాదనకు మద్దతు లభించింది.
వ్యవసాయ సంక్షోభంతో అల్లాడుతున్న రైతు
గుజరాత్ పల్లెలు, పట్టణాల మధ్య విభజన రేఖ ఏర్పడింది. నగరాల్లో నూతన ఫ్లైఓవర్ వంతెనలు వెలిగిపోవడంతోపాటు ఉన్నత స్థాయికి ఎదిగిపోతుంటే గ్రామీణ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. పటేళ్ల ఆందోళన సమస్యగా ఉన్నా పట్టణాలు, నగరాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.గుజరాత్ లో పంచాయతీల వ్యవస్థ పూర్తిగా దెబ్బ తిన్నది. రైతుల్లో బాధ, గ్రామీణ యువతలో నిరుద్యోగం, విద్యావంతుల్లోనూ ఇదే సమస్య ప్రధానాంశాలుగా ఉన్నాయి.
సీఎం, రాష్ట్ర ప్రభుత్వంపై వ్యాపారుల ఆగ్రహం ఎఫెక్ట్
నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో గుజరాతీలకు ఆటంకాలు ఏర్పడినా వ్యాపారాల నిర్వహణలో ఎటువంటి అంతరాయం కలుగలేదని చెప్తున్నారు. గుజరాతీ వ్యాపారులంతా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలతో అనుసంధానమై ఉన్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీ జంట సవాళ్లుగా ముందుకు వచ్చాయి. స్నేహపూరిత వ్యాపార లావాదేవీలు జరిపే గుజరాతీలకు.. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ విధానం వారిలో ఆగ్రహాన్ని కొని తెచ్చింది. అంతే కాదు తమ అభ్యర్థనలు, ఫిర్యాదులు, ఆవేదనలు, విన్నపాలు కూడా వినిపించుకోలేదని రగిలిపోతున్న వ్యాపారులు కూడా ఉన్నారు. ఈ ఆగ్రహం కారణాలు వినిపించగల అవకాశం లేని రాష్ట్ర ప్రభుత్వంపైనా, దానికి సారథ్యం వహిస్తున్న సీఎంపైన పడుతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
నెహ్రూ - గాంధీ వారసులకు మొఘల్ లక్షణాలున్నాయని వ్యాఖ్య
మిలాన్ ముషారఫ్ నుంచి మొఘల్స్ వరకు అహ్మద్ పటేల్ నుంచి సల్మాన్ నిజామీ వరకు.. ఏ రాష్ట్రంలో జరుగని రీతిలో గుజరాత్ రాష్ట్రంలో సామాజిక వర్గాల మధ్య పునరేకీకరణ జరిగిందన్న మాటలు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్తో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని కూడా ప్రధాని మోదీ ఆరోపించారు. మణిశంకర్ అయ్యర్ ఇంట్లో పాకిస్థాన్ అధికారులతో జరిగిన విందు సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాల్గొన్నారని అనుచిత ఆరోపణ చేసి ప్రధాని స్థాయిని తగ్గించారన్న విమర్శలు వచ్చాయి. కలిసి గుజరాత్ రాష్ట్ర జనాభాలో గల 10 శాతం మంది ముస్లింలు ఈ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారలేదు. 2002 తర్వాత ముస్లింల గురించి కాంగ్రెస్ పార్టీ ఈ దఫా ఒక్కసారి కూడా ముస్లింల ప్రస్తావనే తేలేదు. దీనికి బదులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీ.. అడుగడుగునా దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేయడం హిందువులను ఆలోచింపజేసే స్థాయికి తీసుకొచ్చిందంటే అతి శయోక్తి కాదు.
విస్తరణకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకూ అవకాశం
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కులం కార్డు విభిన్నమైన అంశం. అయితే అదే నిర్ణాయక శక్తి అని కూడా పరిగణించలేం. హార్దిక్ పటేల్ సారథ్యంలో పాటిదార్లంతా ఐక్యంగా ఉన్నారు. ఒక సెక్షన్ పాటిదార్లు బీజేపీకి ఓటేసే అవకాశాలు లేవు. సౌరాష్ట్ర ప్రాంతంలోని కోలీల ఓటింగ్, దక్షిణ గుజరాత్ ప్రాంతంలోని కోలీల ఓటింగ్ భిన్నంగా ఉంటుందని అతిశయోక్తి కాదు. దళితులు, గిరిజనులు, ఓబీసీల ఓట్లలో చీలిక వస్తుందని భావిస్తున్నారు. ఓబీసీలంతా అల్పేశ్ ఠాకూర్ నాయకత్వాన్ని గుడ్డిగా నమ్మే అవకాశం లేదని చెప్తున్నారు. బీజేపీ హిందుత్వ ప్లస్ రాజకీయాలు విస్తరణ దిశగా సాగుతుండగా, కాంగ్రెస్ పార్టీ కూడా కుల కార్డుతో తన పునాదిని బలోపేతం చేసుకుంటున్నది.
కాంగ్రెస్ నాయకత్వంలో పునర్వైభవం
రెండు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజేత ఎవరన్నది సంక్లిష్టంగా మారింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కిందిస్థాయి వరకు మారుమూల గ్రామ స్థాయి వరకు క్యాడర్ తో కూడిన పార్టీగా సంస్థాగతంగా తీర్చిదిద్దడం కమలనాథులకు ప్లస్ పాయింట్ అయితే ప్రధాని మోదీ - అమిత్ షా జోడీలకు ఇది సొంత రాష్ట్రం కావడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ స్థాయిలోనే పునర్వైభవం సాధించగలిగింది. కానీ బీజేపీ బూత్ స్థాయి మేనేజ్మెంట్ లో ఆరితేరింది. ఈ దిశగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే పని ప్రారంభించింది. ఎవరు గెలుస్తారన్న సంగతి సోమవారం నాడు తేలనున్నది.
ట్యాంపరింగ్ అవకాశమే లేదన్న ఈసీ అధికారులు
ఫిర్యాదులు ఆందోళన కలిగిస్తున్నా విమర్శలకు తావులేని ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణ.. కేవలం ఓటమి భయం గల వారే చేస్తారు. బహుళ పార్టీ ప్రజాస్వామ్యం గల భారతదేశంలో గెలుపొటములు అనేవి సహజం. ఒక రాష్ట్రంలో ఓటమి మరో రాష్ట్రంలో గెలుపునకు దారి చూపుతుంది. పోర్ బందర్ కాంగ్రెస్ అభ్యర్థి ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపణ చేశారు. కానీ ఎన్నికల సంఘం అధికారులు మాత్రం ట్యాంపరింగ్ చేయడానికి అవకాశాలే లేవని తేల్చేశారు.
కాంగ్రెస్ యువనేత వ్యాఖ్యలతో కమలనాథుల్లో కలవరం
బుధవారం ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో గుజరాతీల్లో ఆగ్రహం నిద్రాణమై ఉన్నదని, జబర్దస్ (ఆశ్చర్యకర) ఫలితాలు రాబోతున్నాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కమలనాథుల్లో కలకలం రేపాయా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ టీవీ ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారుతోంది. 150కి పైగా సీట్లు గెలుచుకుంటామని ఘంటాపథంగా చెప్తున్న బీజేపీ నేతలు.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంటర్వ్యూలపై ఫిర్యాదులు చేయడం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.