ఎన్టీవీకి ఊరట: ప్రసార నిషేధ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
హైదరాబాద్: ఎన్టీవీ చానెల్కు ఊరట లభించింది. ఎన్టీవీ ప్రసారాలను ఫిబ్రవరి 3 నుంచి 10వ తేదీ వరకు నిషేధిస్తూ కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నాలుగు వారాల పాటు నిలిపేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖను ఆదేశిస్తూ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. ఆ మేరకు న్యాయమూర్తి జస్టిస్ భట్టీ బుధవారంనాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్స్ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించామంటూ ఎన్టీవీ ఛానల్ ప్రసారాలను వారం రోజుల పాటు నిషేధిస్తూ కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, వీటిని నిలుపుదల చేయాలని ఎన్టీవీ యాజమాన్యం మంగళవారం నాడు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది.
ఆ ఉత్తర్వు చట్ట విరుద్ధమైనదని, వాటిని కొట్టి వేయాలని డైరెక్టర్ రమాదేవీ వ్యాజ్యంలో కోరారు. 2012లో ఫిబ్రవరి నుండి మే వరకు ఎన్టీవీలో అర్ధరాత్రి సినీ కలర్స్ పేరుతో ప్రసారం అయిన పాటల్లో అశ్లీలత చోటు చేసుకుందని ఓ వ్యక్తి ఫిర్యాదు సమర్పించారు.
దాని ఆధారంగా తమకు 2014 ఆగస్టు 7న సంబంధిత మంత్రిత్వ శాఖ షోకాజ్ నోటీసు జారీ చేసిందన్నారు. ఆ ఆరోపణలను ఖండిస్తూ అదే నెలలో వివరణ ఇచ్చామని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చామన్నారు. తమ వాదనలను పట్టించుకోకుండా టీవీ ప్రసారాలను వారం రోజుల పాటు (ఫిబ్రవరి 3 నుండి 10 వరకు) నిషేధిస్తూ 19న ఆదేశాలు వచ్చాయని, అసలు 2012లోనే ఆ కార్యక్రమాన్ని నిలిపేశామని చెప్పారు.
కాగా, గతంలో రాత్రి పదకొండున్నర గంటలకు సినీ కలర్స్ పేరుతో ప్రసారమయ్యే కార్యక్రమంలోని పాటల్లో అసభ్యత, అశ్లీలత ఉందంటూ కేంద్రానికి ఫిర్యాదు అందింది. దీని పైన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆ కార్యక్రమ డీవీడీలను పరిశీలించింది.