భారీగా పెరిగిన సబ్బులు, డిటర్జెంట్ ధరలు.. ఎందుకంటే..
అసలే కూరగాయాల ధరల పెంపు.. సరుకుల ధరలతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు.. సబ్బులు, డిటర్జెంట్ ధరలు భారీగా పెరిగాయి. చమురు ధరలు భారీగా పెరగడంతో ఇప్పుడు ఆ ప్రభావం నిత్యావసర ధరల మీద పడింది.సబ్బులు, డిటర్జెంట్లతో సహా ఎంపిక చేసిన వస్తువుల ధరలను పెంచినట్లు హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ఐటీసీ లిమిటెడ్ తెలిపాయి. రెండు ప్రముఖ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీలు ఇన్ పుట్ ఖర్చుల గణనీయంగా పెరగడంతో సబ్బులు, డిటర్జెంట్ల ధరలను పెంచినట్లు వివరించాయి.
హెచ్యుఎల్ తన 1 కిలో వీల్ డిటర్జెంట్ పౌడర్ ధరను 3.4 శాతం పెంచింది. వీల్ పౌడర్ 500 గ్రాముల ప్యాక్ ధరను 2 రూపాయలు పెంచడంతో అంతిమ ధర రూ.28 నుంచి రూ.30కి పెరిగింది. ఇంకా, రిన్ బార్ 250 గ్రాముల ప్యాక్ ధరలను 5.8 శాతం పెంచింది. ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు 100 గ్రాముల మల్టీప్యాక్ లక్స్ సబ్బు ధరను 21.7 శాతం పెంచినట్లు నివేదిక తెలిపింది.
ఐటీసీ 100 గ్రాముల ఫియామా సబ్బు ధరను 10 శాతం, వివెల్ వారి ప్యాక్ ధరలను 9 శాతం పెంచినట్లు సమాచారం. 150 మిలీ బాటిల్ ఎంగేజ్ డియోడరెంట్ ధరను 7.6 శాతం, 120 మిలీ బాటిల్ కు ఎంగేజ్ పెర్ఫ్యూమ్ ధరను కంపెనీ 7.1 శాతం పెంచినట్లు నివేదిక తెలిపింది. ఐటీసీ ప్రతినిధి మీడియాతో మాట్లాడారు.ఇన్ పుట్ ఖర్చులు గణనీయంగా పెరగడంతో పరిశ్రమ ధరలను పెంచామని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన వస్తువుల ధరలను మాత్రమే కంపెనీ పెంచినట్లు తెలిపారు. మొత్తం ధరల పెంపును వినియోగదారుల మీద వేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు.