రాహుల్ బజాజ్ ఇక లేరు.. అనారోగ్యంతో కన్నుమూత, కేంద్రమంత్రుల నివాళి
ప్రముఖ పారిశ్రామిక వేత్త, బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ పుణెలో కన్ను మూశారు. భార్య రుపా బజాజ్, కుమారుడు కోడలు రాజీవ్ దీప, సంజీవ్ సెఫాలీ, సునయిన మనీశ్ సమక్షంలో చివరి గడియలు గడిపారు. ఈ మేరకు బజాజ్ గ్రూపు ప్రకటన చేసింది. రాహుల్ బజాజ్ న్యూమోనియాతో బాధపడుతున్నారు. అతనిని గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడ్డాడు. గత నెలలో ఆస్పత్రిలో చేరారు. నెలరోజుల నుంచి చికిత్స తీసుకుంటున్నారు.
శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు చనిపోయారని కంపెనీ తెలిపింది. రాహుల్ బజాజ్ 1938 జూన్ 10వ తేదీన జన్మించారు. అలా క్రమ క్రమంగా ఎదిగారు. బజాజ్ కంపెనీ తక్కువ ధరలో టూ వీలర్ అందించారు. బజాజ్ చేతక్ రూపకల్పనలో రాహుల్ మంచి పేరు గడించారు. కంపెనీకి 40 ఏళ్లు చైర్మన్గా వ్యవహరించారు. భారతీయ కార్పొరేట్ పరిశ్రమలో తనదైన ముద్రను వేశారు. గత ఏడాది నుంచి వ్యవహరాల నుంచి తప్పుకున్నారు. అతనికి 2001లో పద్మ భూషణ్ అవార్డు లభించింది. అతను రాజ్యసభ సభ్యుడిగా కూడా కొనసాగారు.
2021లో పోర్బ్స్లో రాహుల్ బజాజ్ 421 ర్యాంకు సంపాదించారు. 8.2 బిలియన్ డాలర్ల సంపాదనతో నిలిచారు. రాహుల్ మృతిపై కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ నివాళులు అర్పించారు. గత ఐదు దశాబ్దాలుగా బజాజ్ గ్రూప్కు నాయకత్వం వహించిన రాహుల్జీ పరిశ్రమలో కీలకపాత్ర పోషించారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అందించాలని కేంద్ర రోడ్డు శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్ చేశారు. మరో కేంద్రమంత్రి నారాయణ రాణే కూడా నివాళులర్పించారు. ఎన్సీపీ ఎంపీ సుప్రీయ సూలే.. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మలిక్.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నివాళులు అర్పించారు.
ఆయన మరణంతో భారత దేశ పారిశ్రామిక, వ్యాపార రంగాలు విషాదంలో మునిగిపోయాయి. మరోవైపు బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా ట్విట్ చేశారు. రాహుల్ బజాజ్ మరణ వార్త తనను కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని, ఆయనను ఎంతో కోల్పోతున్నానని చెప్పారు. మన దేశ నిర్మాతల్లో ఒకరైన గొప్ప కొడుకును దేశం కోల్పోయిందని అన్నారు.