'జయ చికిత్సకు రూ.5.5 కోట్లు, చివరిదాకా మాట్లాడారు, రాజకీయ ఒత్తిళ్లు లేవు'
దివంగత జయలలిత ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని అపోలో ఆసుపత్రి వైద్యులు, లండన్ డాక్టర్ రిచర్డ్ బాలే సోమవారం నాడు వెల్లడించారు.
చెన్నై: దివంగత జయలలిత ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని అపోలో ఆసుపత్రి వైద్యులు, లండన్ డాక్టర్ రిచర్డ్ బాలే సోమవారం నాడు వెల్లడించారు. జయ మృతి పైన పలువురు అనుమానాల వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ఈ రోజు విలేకరుల సమావేశం నిర్వహించారు.
జయలలితకు చికిత్స అందించిన గదిలో ఎలాంటి సీసీ కెమెరాలు లేవని చెప్పారు. ఫోటోలు, వీడియోల గురించి విలేకరులు అడగగా.. పేషెంట్ క్రిటికల్ కేర్లో ఉంటే ఫోటోలు, వీడియోలు ఎలా తీస్తామని ప్రశ్నించారు.
జయలలిత ఇలా చనిపోయారు.. లండన్ డాక్టర్, అపోలో వైద్యుల ప్రకటన
ఆమెకు సాధారణ ఎంబామింగ్ మాత్రమే చేశామని చెప్పారు. జయలలిత కాళ్లు తీయలేదని చెప్పారు. ఖర్చు రూ.5.5 కోట్లు అయిందని, చివరి నిమిషం దాకా ఆమె మాట్లాడారని చెప్పారు.
రిచర్డ్ బాలేను పిలిపించి మరీ...
జయలలిత మరణంలో ఎలాంటి కుట్ర జరగలేదని లండన్ వైద్యుడు రిచర్డ్ బాలే వెల్లడించారు. అపోలో ఆస్పత్రి ఐసీయూలో జయలలితకు అందించిన చికిత్సను ఆయనే దగ్గరుండి పర్యవేక్షించారు. జయ మరణంపై పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఆయనను చెన్నైకి పిలిపించి మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
రాజకీయాలకు నో
జయలలిత మరణంపై వెలువడుతున్న పుకార్లపై వివరణ ఇచ్చేందుకే తాను వచ్చినట్టు రిచర్డ్ పేర్కొన్నారు. రాజకీయ సంబంధమైన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పలేనని వైద్య సంబంధమైన విషయాలనే అడగాలని మీడియాను కోరారు. జయలలిత మరణం వెనుక గల కారణాలు, ఆమెకు అందించిన వైద్యంపై పలు సందేహాలకు సమాధానం చెప్పారు.
ఆసుపత్రిలో..
శ్వాస సంబంధమైన ఇబ్బందులతో జయలలిత అపోలో ఆస్పత్రిలో చేరారని, ఆమె రక్తంలో ఇన్ఫెక్షన్ ఉందని, రక్తంలో చెడు బ్యాక్టీరియా (సెప్సిస్) ఉన్నట్టు గుర్తించినట్లు చెప్పారు. శ్వాస సంబంధమై ఇబ్బందులు ఆమె శరీర అవయవాలు దెబ్బతినేందుకు కారణమయ్యాయన్నారు. బీపీ సమస్య కూడా తీవ్రంగా ఉండడంతో పరిస్థితి మరింత జఠిలమైందని చెప్పారు. రక్తంలో వ్యాధికారక క్రిములతో పాటు నియంత్రణ కాని సుగర్ లెవెల్స్, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్, రక్తపోటు, డీహైడ్రేషన్ సమస్యలతో జయలలితను బాధించాయన్నారు. ఆమె ఆస్పత్రికి వచ్చినప్పుడు స్పృహలోనే ఉన్నారని చెప్పారు. చికిత్సకు స్పందించారన్నారు.
బాగానే మాట్లాడారు
జయలలితను ఆస్పత్రికి తీసుకురాగానే ముందుగా ఆమె ఆరోగ్యాన్ని పరిస్థితిని స్థిరంగా ఉంచే ప్రయత్నం జరిగిందని, మగతగా ఉన్నప్పటికీ వారం రోజుల పాటు అధికారులతో మాట్లాడుతూ పాలనా కార్యక్రమాలు చూసుకున్నారన్నారు. అందరితో బాగానే మాట్లాడారనీ, ఆహారం కూడా స్వయంగా తీసుకున్నారన్నారు. వైద్యం తీసుకుంటున్న సమయంలో కొన్ని అడుగులు మాత్రమే నడవగలిగే వారని తెలిపారు.
అప్పుడే తేలిపోయింది
జయ కోలుకుంటున్నారని అనుకునే సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడం జరిగిందన్నారు. గుండెపోటు వచ్చినట్టు గుర్తించిన వెంటనే 20 నిమిషాల పాటు కార్డియోపల్మనరీ ప్రక్రియ నిర్వహించామన్నారు. ఫలితం లేకపోవడతో ఎక్స్ట్రాకార్పొరియల్ మెంబ్రేన్ ఆక్సిజెనేషన్ (ఈజీఎంవో) అందించామన్నారు. 24 గంటల తర్వాత కూడా ఆమె గుండె స్పందించలేదనీ, దీంతో చికిత్స అందినా ఇక ప్రయోజనం ఉండదన్న నిర్ణయానికి వచ్చామన్నారు. ఈ విషయాన్ని అందరు సంబంధిత డాక్టర్లు, మంత్రులు, భారత ప్రభుత్వానికి కూడా తెలిపామన్నారు.