అమ్మకు వీడ్కోలు: అంతిమ సంస్కారాలు నిర్వహించిన శశికళ, శోకసంద్రంలో పన్నీరు
రాజ్ భవన్ నుంచి జయలలిత అంతిమ యాత్ర సాయంత్రం ప్రారంభమైంది. కాసేపట్లో మెరీనా బీచ్లో ఆమెను ఖననం చేయనున్నారు. జయలలితను చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు.
చెన్నై: జయలలిత అంత్యక్రియలు చెన్నైలోని మెరీనా బీచ్లో పూర్తయ్యాయి. రాజ్ భవన్ నుంచి జయలలిత అంతిమ యాత్ర సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రారంభమైంది. ఆరు గంటల ప్రాంతంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.
అంతిమ యాత్ర ఇలా..
- అంతిమ సంస్కారం సందర్భంగా ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, హాజరైన వారు, తమిళులు విషాద సంద్రంలో మునిగిపోయారు.
- జయలలితకు శశికళ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. జయ వెంట జయ సోదరుడు జయకుమార్ తనయుడు దీపక్ ఉన్నారు.
- శశికళ నివాళులు అర్పించారు. జయకు అంత్యక్రియల సందర్భంగా మెరీనా బీచ్లోనే కాకుండా, తమిళనాడులో చాలామంది కంటతడి పెట్టారు.
- ఎంజీఆర్ సమాధి పక్కనే అధికార లాంఛనాలతో జయలలితను ఖననం చేశారు.
- వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు.
- అనంతరం నిమిషం పాటు మౌనం వహించారు.
- గౌరవ సూచకంగా గన్ సెల్యూట్ చేశారు.
- జయ మృతదేహాన్ని ఖననం చేసే స్థలానికి తీసుకు వచ్చారు.
- అంతిమ యాత్ర ఐదున్నర గంటలకు మెరీనా బీచ్ చేరుకుంది. జనాలు లక్షల్లో తరలి వచ్చారు.
- మెరీనా బీచ్ వద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అమ్మ అంత్యక్రియలను జనాలు చూసేందుకు వీటిని ఏర్పాటు చేశారు.
- అమెను చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు. చాలామంది కంటతడి పెట్టారు. ఉద్వేగం పెల్లుబుకింది.
- వాహనంలో శశికళ, ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఉన్నారు.
- నాలుగున్నరకు అంతిమయాత్ర ప్రారంభమైంది.
- రాజాజీ హాల్లో జయలలితకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేత గులాంనబీ ఆజాద్, పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఆ తర్వాత అంతిమయాత్ర ప్రారంభమైంది.
మరోవైపు జయలలిత అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరిగే అంత్యక్రియలకు ప్రభుత్వ ప్రతినిధులుగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, పొన్రాధాకృష్ణన్లు నియమితులయ్యారు.
అశేష జనవాహిని
లక్షలాది జనవాహిని అశ్రునయనాల మధ్య కేంద్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జయలలిత అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం చెన్నై మెరీనా బీచ్లో పూర్తయ్యాయి. ఎంజీఆర్ సమాధికి సమీపంలోనే ఆమెను ఖననం చేశారు.
గౌరవ వందనం
త్రివిధ దళాల సైనికాధికారులు గౌరవ వందనం సమర్పించగా, వైష్ణవ గురువు పర్యవేక్షణలో శశికళ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
అంత్యక్రియల్లో పాల్గొన్న గవర్నర్
తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర రావు, త్రివిధ దళాల అధికారులు అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్రం తరఫున..
అంత్యక్రియలకు కేంద్రం తరఫున వెంకయ్యనాయుడు, రాధాకృష్ణన్లు హాజరయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, తంబిదురై, మాజీ గవర్నర్ రోశయ్య, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు తదితరులు జయలలిత పార్థివదేహం వద్ద చివరిసారిగా నివాళులర్పించారు.
జనవాహిని
అమ్మను చివరి చూపు చూసేందుకు అశేష జనవాహిని వచ్చింది. వారంతా కన్నీరుమున్నీరు అయ్యారు. శవపేటికపై పురచ్చి తలైవి సెల్వి జె జయలలిత అని రాశారు. జయలలితకు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు నివాళులు అర్పించారు.
భావోద్వేగం
జయలలిత అంతిమయాత్రకు అశేష జనవాహిని తరలివచ్చింది. రాజాజీ హాల్ నుంచి మెరీనా బీచ్ వరకు సాగిన అంతిమయాత్రలో దారి పొడవునా ప్రజలు నివాళులర్పించారు. జయలలిత భౌతికకాయాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. అన్నాసాలై ప్రాంతం జనసందోహంతో కిక్కిరిసి పోయింది.
కాలి నడకన మంత్రులు, నేతలు
మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అంతిమయాత్రకు ముందుండి కాలినడకన మెరీనా బీచ్కు చేరుకున్నారు. మెరీనా బీచ్లో అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎంజేఆర్ సమాధి పక్కనే ఖననం చేసేందుకు శవపేటికను సిద్ధంగా ఉంచారు.