దక్షిణాది స్త్రీలు నల్లగా ఉన్నా..: తప్పు కాదని.. శరద్ యాదవ్కు పార్టీ మద్దతు
పాట్నా: జేడీయూ అధ్యక్షులు శరద్ యాదవ్.. దక్షిణాది మహిళల పైన తాను చేసిన వ్యాఖ్యల పైన క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా కనిపించడం లేదు. అంతేకాదు, ఆయనను పార్టీ వెనుకేసుకొస్తోంది. శరద్ యాదవ్ వారి అందాన్ని పొగిడారని పార్టీ తెలిపింది. ఆయన వ్యాఖ్యలు కాకుండా... ఆయన చెప్పిన అభిప్రాయాన్ని గుర్తించాలంటున్నారు. ఆయన ఉద్దేశ్యంలో తప్పు లేదని చెప్పింద.
కాగా, శరద్ యాదవ్ దక్షిణాది భారత మహిళల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇవి తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. అతని వ్యాఖ్యల పైన సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై పార్లమెంటు దద్దరిల్లింది. శరద్ యాదవ్ 2012లో ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎంపిక కావడం గమనార్హం.
దక్షిణ భారత మహిళలు అందంగా ఉంటారని, వారు నల్లగా ఉన్నా పట్టించుకోమని, వారు ఆకర్షణీయంగా కనబడతారని, నృత్యం చేయడం కూడా బాగా వచ్చునని వ్యాఖ్యానించారు. ఉత్తరాదివారికన్నా దక్షిణాది మహిళలే బాగా ఉంటారన్నారు.

రాజ్యసభలో బీమా సంస్కరణల బిల్లుపై చర్చ సందర్భంగా శరద్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీమారంగంలో విదేశీ పెట్టుబడులను ప్రభుత్వం ఆహ్వానించడాన్ని ఎద్దేవా చేస్తూ.. భారతీయులకు తెల్ల చర్మంగలవాళ్లంటే ఆసక్తి ఎక్కువ అన్నారు.
ఇక్కడ ప్రజలు తెల్లటి శరీరఛాయగల వారి వెంట పడుతుంటారని, వివాహ ప్రకటనల్లోనూ తెల్లటి శరీర ఛాయ ఉన్నవాళ్లు కావాలంటుంటాని వ్యాఖ్యానించారు. అంతేగాక నిర్భయ డాక్యుమెంటరీ తీయడానికి లెస్లీ ఉడ్విన్కి అనుమతి వచ్చిందంటే ఆమె తెల్లటి శరీరమే కారణమన్నారు.
కొందరు ఎంపీలు ఆయన వ్యాఖ్యల్ని అడ్డుకోవాలని చూశారు. కానీ ఆయన తన వ్యాఖ్యలను పూర్తి చేశారు. పైగా తన వ్యాఖ్యలను సరదాగా తీసుకోవాలని సూచించారు. డీఎంకే ఎంపీ కనిమొళి ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, శరద్ అనుచిత వ్యాఖ్యలపై సోషల్ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తాయి.












Click it and Unblock the Notifications